KBR పార్కులో సినీనటిపై దాడి తర్వాత Hyderabad లో ఒక్కసారిగా మారిన సీన్..!
ABN , First Publish Date - 2021-11-23T12:02:38+05:30 IST
ఇటీవల కేబీఆర్ పార్కులో సినీ నటిపై దాడి ఘటనలో...
- నిఘానీడలో భాగ్యనగరం..
- 3,168 హైటెక్ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం
- పోలీస్ ఉన్నతాధికారులతో సీపీ అంజనీకుమార్ సమీక్ష
హైదరాబాద్ సిటీ : సేఫ్ సిటీలో భాగంగా ట్రై కమిషనరేట్స్ పరిధిలో 3,168 హై టెక్నాలజీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ సీపీ, సేఫ్ సిటీ ప్రాజెక్టు నోడల్ ఆఫీసర్ అంజనీకుమార్ తెలిపారు. రాచకొండ, సైబరాబాద్ సీపీలు మహేష్ ఎం.భగవత్, స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శిఖాగోయల్తో కమిషనరేట్లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల కేబీఆర్ పార్కులో సినీ నటిపై దాడి ఘటనలో సీసీటీవీ కెమెరాలు పని చేయకపోవడంతో నిందితుడిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు దిద్దుబాటు చర్యలకు దిగారు. సేఫ్ సిటీలో భాగంగా ట్రై కమిషనరేట్లలోని పలు హాట్ స్పాట్లలో హై టెక్నాలజీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ కమిషనరేట్కు గోవా బృందం..
గోవా శాసనసభ్యులతో పాటు స్పీకర్ రాజేష్ పాత్నికర్ సోమవారం హైదరాబాద్ కమిషనరేట్ను సందర్శించారు. పెద్ద ఉత్సవాలైన గణేష్ నవరాత్రులు, శ్రీరామ నవమి, ఈద్, మొహర్రం సందర్భాల్లో బందోబస్తు నిర్వహణ, టెక్నాలజీ వినియోగం, పోలీసుల పనితీరును సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. పోలీసుల పనితీరును, నైపుణ్యం గురించి తెలుసుకున్న గోవా స్పీకర్ ప్రశంసించారు. కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ సునీతారెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.