ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్
ABN , First Publish Date - 2020-05-12T10:04:16+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, కార్యాలయాల్లో అన్ని సేవలు అందుబాటులో
ప్రయాణ అనుమతికూడా ఆన్లైన్లోనే...
డీఐజీ ఎస్డీ ట్వింకిల్జాన్
కరీంనగర్ క్రైం, మే 11: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, కార్యాలయాల్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ ఎస్డీ ట్వింకిల్జాన్ తెలిపారు. కరీంనగర్లోని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ కార్యాలయంలో సోమవారం జిల్లా రిజిస్ట్రార్ జి ప్రసూనతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు వెబ్సైట్లో పబ్లిక్ డాటా ఎంట్రీ ద్వారా వారి వివరాలు నమోదుచేసుకుని, స్టాంపు డ్యూటీ తదితర చలాన్లు ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు.
ఏ రోజున రిజిస్ర్టేషన్ చేసుకోదలుచుకున్నారో ఆ తేదీతో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని సమయానికి కార్యాలయానికి వెళ్లాలన్నారు. స్లాట్ బుక్చేసుకున్న సమయంలో సంబంధిత సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి పత్రం(పాస్) కూడా ఆన్లైన్లో లభిస్తుందని తెలిపారు. పోలీసు చెక్పోస్టుల వద్ద ఈ పత్రాన్ని చూపిస్తే అనుమతిస్తారని చెప్పారు. దస్తావేజులు ఆన్లైన్లో నమోదు చేసుకుని, స్టాంపు డ్యూటీ తదితర చలాన్లు చెల్లించి ఏమైనా కారణాల వల్ల కార్యాలయానికి వెళ్లలేకపోతే ఆ దస్తావేజులను తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశముంటుందన్నారు. భార ధృవీకరణ పత్రం (ఈసీ), దస్తావేజు నఖలు మీ సేవ నుంచి మాత్రమే పొందాలన్నారు. లేదా వెబ్సైట్నుంచి ఆన్లైన్లో రుసుం చెల్లించి కూడా భార ధృవీకరణ పత్రం, దస్తావేజు నఖలు పొందవచ్చన్నారు. కార్యాలయానికి వచ్చే వారు తప్పని సరిగా మాస్కు ధరించాని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే రిజిస్ట్రేషన్ శాఖ టోల్ఫ్రీ నంబరు 18005994788కు ఫోన్చేసి గాని, వాట్సప్ నంబరు 9121220272కు సందేశం పంపి గాని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో కరీంనగర్ సబ్రిజిస్ట్రార్ డీ అశోక్కుమార్, సూపరింటెండెంట్ మక్సూద్ పాల్గొన్నారు.