నీరసంగా ప్రభుత్వ భవనాల నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-06-10T05:59:06+05:30 IST

ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడానికి చేపట్టిన భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం నెలకొంది

నీరసంగా ప్రభుత్వ భవనాల నిర్మాణాలు
ఐరాల మండలం కామినాయనిపల్లెలో నిర్మాణ దశలో వున్న రైతు భరోసా కేంద్ర భవనం

ఏడాదైనా 33 శాతమే పనులు


చిత్తూరు సిటీ, జూన్‌ 9: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడానికి చేపట్టిన భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం నెలకొంది. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్ల నిర్మాణాలు ఏడాది గడుస్తున్నా 33 శాతమే పూర్తయ్యాయి. వివిధ కారణాలతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఆయా కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1016 గ్రామ సచివాలయాలు, 924 రైతు భరోసా కేంద్రాలు, 721 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు.. ఇలా మొత్తం 2661 భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో ఇప్పటి వరకు సుమారు 889 భవనాలు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి.

 50 శాతం పురోగతిలో సచివాలయాల భవనాలు


ఏడాది కిందట జిల్లాలో 1016 గ్రామ సచివాలయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.376.75 కోట్లు మంజూరు చేసింది. అందులో ఇప్పటివరకు సుమారు 554 భవనాలు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వీటి నిర్మాణంకోసం రూ.131 కోట్లు విడుదల చేశారు. కాగా 311 భవనాలు లింటెల్‌, స్లాబు దశలో, 63 బేస్‌మెంట్‌ లెవెల్‌లో, 60 ప్రారంభ దశలో ఉండగా 28 భవనాల నిర్మాణాలు భూ వివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాలతో ప్రారంభం కాలేదు.

 924 భవనాల్లో 214 మాత్రమే పూర్తి


జిల్లాలో 924 రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.201 కోట్లు మంజూరు చేసింది. అందులో ఇప్పటివరకు సుమారు 214 భవనాలు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వీటి నిర్మాణం కోసం రూ.44 కోట్లు విడుదల చేశారు. కాగా 282 భవనాలు లింటెల్‌, స్లాబుదశలో, 237 బేస్‌మెంట్‌ లెవెల్‌లో, 183 ప్రారంభ దశలో ఉండగా 8 భవనాల నిర్మాణాలు భూవివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాలతో ప్రారంభం కాలేదు.

 ఐదో వంతు కూడా పూర్తి కాలేదు


జిల్లాలో 721 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.126 కోట్లు మంజూరు చేసింది. అందులో ఇప్పటివరకు సుమారు 121 భవనాలు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వీటి నిర్మాణం కోసం రూ.20 కోట్లు విడుదలైంది. కాగా 157 భవనాలు లింటెల్‌, స్లాబుదశలో, 231 బేస్‌మెంట్‌ లెవెల్‌లో, 206 ప్రారంభ దశలో ఉండగా 8 భవనాల నిర్మాణాలు భూవివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాలతో ప్రారంభం కాలేదు. 


కరోనా కారణంగానే నిర్మాణాలు ఆలస్యం 


గతేడాది జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రభుత్వ భవనాల నిర్మాణాలు కరోనా కారణంగా మార్చి నుంచి ఆగస్టు వరకు సుమారు ఆరు నెలలపాటు ఆగిపోయాయి. నిర్మాణ పనులకు కార్మికులు ముందుకు రాకపోవడంతో తిరిగి సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించాం. ప్రస్తుతం నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సచివాలయాల నిర్మాణాలు 50 శాతం పూర్తయి ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే అన్ని భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తాం. 

- అమరనాథరెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ

Updated Date - 2021-06-10T05:59:06+05:30 IST