సంఘ సంస్కర్త పూలే
ABN , First Publish Date - 2021-11-29T06:13:51+05:30 IST
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్ పి.కోటేశ్వరరావు, మేయర్ బీవై రామయ్య అన్నారు.
- కలెక్టర్ పి కోటేశ్వరరావు
- వర్ధంతి సందర్భంగా నివాళి
కర్నూలు(ఎడ్యుకేషన్), నవంబరు 28: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్ పి.కోటేశ్వరరావు, మేయర్ బీవై రామయ్య అన్నారు. పూలే వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని బిర్లాగేటు సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్, మేయర్, జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. సమసమాజ స్థాపన కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరా డుతూ, అందరికీ విద్యనందించాలని ఉద్యమం నడిపారని అన్నారు. మహనీయుల ఆశయసాధన కోసం కృషి చేయాలని, అదే వారికి నిజమైన నివాళి అని అన్నారు. అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని మేయర్ అన్నారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, ఈడీ జాకీర్హుశేన్, బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.