గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం
ABN , First Publish Date - 2021-04-21T05:08:53+05:30 IST
గ్రీవెన్స్ మాడ్యుల్ ద్వారా భూముల సమస్యలు వేగంగా పరిష్కరించవచ్చని కలెక్టర్ వెంకట్రామారెడ్డి అన్నారు.
కలెక్టర్ వెంకట్రామారెడ్డి
వర్గల్, ఏప్రిల్ 20: గ్రీవెన్స్ మాడ్యుల్ ద్వారా భూముల సమస్యలు వేగంగా పరిష్కరించవచ్చని కలెక్టర్ వెంకట్రామారెడ్డి అన్నారు. ములుగు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వెంకట్రామారెడ్డి వర్గల్ మండలంలో ధరణి పెండింగ్ భూముల సమస్యలపై తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భూసమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం వేగవంతంగా పనిచేస్తుందన్నారు. ధరణితో భూముల రికార్డులకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 28వేల 241 మంది రైతులు ధరణి సేవలను వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. మ్యుటేషన్లు, సెల్స్, ఆధార్సిండింగ్, డిజిటల్ సిగ్నేచర్ వంటి వివిధ అంశాలకు సంబంధించి 241 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అందులో ప్రాపర్టీ సెల్కు సంబంధించి 12,029, గిప్ట్ డీడీలు 2,975, పెండింగ్ మ్యుటెషన్లు 10,298, ఆదార్ సీడింగ్ 2,043, ఎన్ఆర్ఐలు 7, గ్రీవెన్స్ మాడ్యూల్ 3,346 మంది అర్జీలు పెట్టుకున్నారన్నారు. మిషన్ మోడ్లో క్షేత్రస్థాయి సమగ్ర విచారణ చేపట్టి వీటి పరష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. ధరణి ద్వారా జిల్లాలో ఇప్పటికి 10,298 మ్యుటెషన్లు పూర్తి చేశామన్నారు. వర్గల్ మండలంలో 1,003 రిజిష్ట్రేషన్లు, 382 మ్యుటెషన్లు అమలు చేశామన్నారు. భూముల సమస్యలపై మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా కలెక్టర్ కంప్యూటర్కు సంబంధిత అర్జీ వస్తుందన్నారు. క్షేత్రస్థాయి అధికారుల ద్వారా 48 గంటల్లో సమస్యపై పరిష్కార నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రీవెన్ మాడ్యుల్లో భూముల సమస్యల పరిష్కారం కోసం నమోదు చేసుకుంటే వాటిని తాను స్వయంగా పరిశీలించి తహసీల్దార్, ఆర్డీవోలకు పంపి వారి నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా పరిష్కరిస్తామన్నారు. గ్రీవెన్స్ మాడ్యుల్లో 3,642 దరఖాస్తులు రాగా 2,196 అర్జీలకు సంబంధించి తహసీల్దార్, ఆర్డీవోల నుంచి రిపోర్టు వచ్చిందన్నారు. తన సంతకంతో ధరణిలో వచ్చే మూడు రోజుల్లో నమోదు చేస్తామన్నారు. అనంతరం రైతులు స్లాట్ బుక్ చేసుకునే మార్పులు, చేర్పులు చేసుకోవచ్చన్నారు.