ఆయనకు 73.. ఆమెకు 26!
ABN , First Publish Date - 2021-10-14T08:41:13+05:30 IST
ద్దరూ వధూవరులు.. ఆయనకు 73 ఏళ్లు. ఆమెకు 26 ఏళ్లు. ఇద్దరి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం. అయినా...
- ఇరు కుటుంబీకుల సమక్షంలో వివాహం
- ఇద్దరి మధ్య 47 ఏళ్ల గ్యాప్.. ఇద్దరికీ రెండో పెళ్లే!
ముథోల్, అక్టోబరు 13: ఇద్దరూ వధూవరులు.. ఆయనకు 73 ఏళ్లు. ఆమెకు 26 ఏళ్లు. ఇద్దరి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం. అయినా మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబీకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామంలో ఈ వివాహం జరిగింది. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. ముథోల్ మండలం చింతకుంట తండాగ్రామానికి చెందిన రాథోడ్ కిషన్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. కిషన్ భార్య గతంలో అనారోగ్యంతో మృతిచెందడంతో అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. కుభీర్ మండలం రంజని తండా(హిప్నెల్లి)కు చెందిన సునీత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమెకు ఒక పాప. కూలీ పనులు చేస్తూ పాపను పోషించుకుంటోంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్, సునీత పరస్పరం పరిచయమయ్యారు. పెళ్లిచేసుకోవాలనుకున్నారు. విషయాన్ని తమ తమ కుటుంబసభ్యులకు చెప్పారు దేగాం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో కిషన్, సునీత వివాహం జరిగింది.