రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
ABN , First Publish Date - 2020-02-28T11:18:18+05:30 IST
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి ఎస్పీ అపూర్వారావు తెలిపారు.
తరచూ డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు : ఇన్చార్జి ఎస్పీ అపూర్వారావు
గద్వాలక్రైం, ఫిబ్రవరి 27 : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి ఎస్పీ అపూర్వారావు తెలిపారు. డ్రైంక్ అండ్ డ్రైవ్లో తరుచూ పట్టుబడ్తున్న వారి డ్రైవింగ్ లెసెన్స్ రద్దుకు చర్యలు తీసుకుం టామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. మైనర్ల డ్రైవింగ్పై కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. తరచూ ప్రమాదాలు చేసే వారిని, గుర్తించి వారి లైసెన్స్లను రద్దు చేసేలా ఆర్టీఓకు ప్రతిపాదనలు పంపించాల న్నారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై అధికారులు నిరంతరం ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గద్వాల, అయిజ, శాంతినగర్ పట్టణాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు సత్వరమే ప్రణాళికలు రూపొందించు కోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పట్టణాలలో దుకాణాల ముందు అక్రమంగా నిర్మించిన షెడ్లు ట్రాఫిక్ అంతరాయానికి కారణమవుతున్నాయని, వాటి తొలగింపునకు మునిసిపాలిటీ అధికారులతో కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఉదయం, సాయంత్రం స్పాట్ కేసులు, కెమెరా కేసులు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో హైవే అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బారికేడ్లను, వేగ నియంత్రికలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులపై ఆరాతీస్తూ, కారణాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కృష్ణ, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐలు హనుమంతు, వెంకటేశ్వర్లు, గోపి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాజేందర్రెడ్డితో పాటు ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.