ఆట..ంకాలు
ABN , First Publish Date - 2021-12-03T06:22:04+05:30 IST
ఆట..ంకాలు
ఇక క్రీడా మైదానాల్లో ఉచిత శిక్షణకు బ్రేక్
యూజర్ చార్జీలను నిర్ణయించిన ప్రభుత్వం
క్రీడా మైదానాలకు చేరిన ఉత్తర్వులు
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ఆసక్తిపై దెబ్బ
మండిపడుతున్న క్రీడా సంఘాలు
ఆసక్తి ఉంది కదా.. అని ఆడేద్దామన్నా, నేర్చుకుందామన్నా ఇక కుదరదు. క్రీడా మైదానాల్లో ఆట రేటు పలుకుతోంది. అడ్మిన్ ఫీజుతో పాటు నెలవారీ రుసుము చెల్లిస్తేనే క్రీడా మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో ఉన్న అవుట్డోర్, ఇండోర్ స్టేడియాల్లో అడుగు పెట్టాలన్నా, ఆట ఆడాలన్నా ఈ రుసుము చెల్లించాల్సిందే. క్రీడలను ప్రోత్సహించి, గ్రామీణ ప్రాంత యువతను ప్రోత్సహించాల్సిన శాప్ (రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ) తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : అవుట్డోర్ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియాల్లో క్రీడలకు యూజర్ చార్జీలను ఆయా క్రీడాకారుల నుంచే వసూలు చేయాలని శాప్ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధిం చిన ఉత్తర్వులు జిల్లా క్రీడాధి కారుల(చీఫ్ కోచ్)కు, ఆయా క్రీడల ఫెడ రేషన్లకు చేరాయి. ఇప్పటివరకు ఇండోర్ స్టేడియాల్లో క్రీడలకు మాత్రమే అడ్మిషన్ ఫీజు, నెలవారీ ఫీజు అమల్లో ఉండేది. దీన్ని అదు నుగా చేసుకుని అవుట్డోర్ స్టేడియాల్లోనూ వర్తింపజేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇండోర్ స్టేడియాల్లో ఉన్న అడ్మిషన్, నెలవారీ ఫీజులను భారీగా పెంచారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే అవుట్డోర్ స్టేడియా ల్లో క్రీడలూ ఖరీదుగా మారిపోవడం ఖాయం.
ఇదెక్కడి ప్రోత్సాహం?
వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు, ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు క్రీడా మైదానాల్లో శిక్షణ పొందుతారు. పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి మైదానాలకు పంపుతారు. ఈ క్రీడల్లో దేనికీ విద్యార్థులు నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ క్రీడా మైదానాలకు గ్రామీణ ప్రాంత, పేద క్రీడాకారులు వచ్చి శిక్షణ పొందుతారు. ఇప్పుడు ఈ క్రీడల్లో శిక్షణ పొందే క్రీడాకారుల నుంచి రుసుము వసూలు చేయాలని శాప్ నిర్ణయించింది. 14 ఏళ్లులోపు ఉన్న క్రీడాకారులకు ఒక రేటును, 14 ఏళ్లు పైబడిన వారికి మరో రేటును నిర్ణయించి ధరల పట్టికను సంబంధిత క్రీడా మైదానాలకు పంపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియం అవుట్డోర్ కేటగిరీలోకి వస్తాయి. విజయవాడ ఎంజీ రోడ్డులోని డీఆర్ఆర్ స్టేడియం, పటమట లోని చెన్ను రామకోటయ్య స్టేడియం ఇండోర్ కేటగిరీలోకి వస్తాయి. అవుట్డోర్ స్టేడియంలో అడ్మిషన్ ఫీజుతో పాటు నెలవారీ సభ్యత్వం, ఏడాది, మూడేళ్ల కాలపరిమితి, జీవితకాల సభ్యత్వాన్ని నిర్ణయించారు. విజయవాడలో రెండు ఇండోర్ స్టేడియాలు ఉన్నాయి. ఎంజీ రోడ్డులో డీఆర్ఆర్ స్టేడియం, పటమటలోని చెన్నుపాటి రామకోటేశ్వరరావు ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఆటలు ఆడాలనుకున్న వారు గానీ, నేర్చుకోవాలనుకున్న వారు గానీ అడ్మిషన్ ఫీజుగా రూ.2వేలు చెల్లించాలి. నెలవారీ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు పిల్లలు, ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు పెద్దలు ఆడతారు.
క్రీడాసంఘాల పెదవివిరుపు
శాప్ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. క్రీడాసంఘాలు, క్రీడాకారులు మండి పడుతున్నాయి. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పేద విద్యార్థులు, గ్రామీణ క్రీడా కారులపై ప్రభావం చూపుతుందని క్రీడాసంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.