45ఏళ్లు నిండిన సిబ్బందికి వ్యాక్సిన్ ఇప్పించాలి
ABN , First Publish Date - 2021-04-10T05:45:23+05:30 IST
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్స్, అధికారులకు, సిబ్బందికి వ్యాక్సినేషన్ తప్పని సరిగా జరిగేలా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు.
ఆదిలాబాద్టౌన్, ఏప్రిల్ 9: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్స్, అధికారులకు, సిబ్బందికి వ్యాక్సినేషన్ తప్పని సరిగా జరిగేలా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ను శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్, పంచాయతీవర్కర్స్, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పని చేస్తున్న సిబ్బందికి 45 ఏళ్లు నిండిన వారందరికి తప్పని సరిగా వ్యాక్సిన్ ఇప్పించాలన్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలో నోడల్ అధికారులుగా వ్యవహరించాలని, జిల్ల పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ సీఈవో ప్రజా ప్రతినిధులకు సమన్వయకర్తగా వ్యవహరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సమన్వయం చేస్తూ వ్యాక్సినేషన్ పంపిణీ జరిగేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రంట్లైన్ వర్కర్లకు, 45ఏళ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్ అందించేందుకు మండల స్థాయిలో టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, సబ్సెంటర్ వారీగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారీగా వ్యాక్సినేషన్ పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లోజిల్లా పరిషత్ సీఈవో గణపతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.