కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-04-21T05:17:25+05:30 IST
కరోనా నియంత్రణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు.
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 20: కరోనా నియంత్రణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మంగళవారం వెబ్నార్ ద్వారా వైద్య, పంచాయతీ రాజ్, మునిసిపల్, సర్పంచులతో కొవిడ్ నియంత్రణ, ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉపాధిహామీ, హరితహారం, మొక్కల సంరక్షణపై అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు 45 ఏళ్లు దా టిన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకు గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు, డీపీవో బాధ్యతలు తీసుకోవాలని, మునిసిపాలిటీలో కమిషనర్లు, కౌన్సిలర్లు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. జన సంచార ప్రదేశాల్లో మాస్కులు లేకుండా కన్పిస్తే రూ.వెయ్యి జరిమానా విధించాలని పోలీస్, మునిసిపల్ అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా శానిటేషన్ చేయాలని, హైపోక్లోరైడ్ వంటి ద్రావణాలతో శానిటేషన్ చేయడం, ఫాగింగ్ చేయడం వంటివి చేపట్టాలని సూచించారు. ఉపాధి కూలీలు ఉదయాన్నే పనులకు వెళ్లి ఎండలు తీవ్రమయ్యేలోగా ఇంటికి చేరుకునేలా అదికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెబ్నార్లో జిల్లా వైద్య, ఆరోగ్య, పంచాయతీ రాజ్, మునిసిపల్ శాఖ అదికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను మెయిల్ ద్వారా నమోదు చేసుకోవాలి
ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు ఫోన్ ద్వారా లేక మెయిల్స్ ద్వారా నమోదు చేసుకో వాలని కలెక్టర్ హరిచందన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పెరుగు తున్న కరోనా కేసులతో ఫిర్యాదుదారులు ఎవరూ కలెక్టరేట్కు రావడం లేదన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ కార్యాలయం నెంబర్లు 9154283913, 9154283914కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేయించు కోవాలని ఆమె సూచించారు. లేదా ప్రజావాణి ఎన్ఆర్పీటీకు మెయిల్ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు.