బర్డ్‌ఫ్లూపై వదంతులను అరికట్టండి

ABN , First Publish Date - 2021-01-11T06:51:03+05:30 IST

బర్డ్‌ ఫ్లూ వైరస్‌ పై ప్రజలకు అవగాహన కల్పించాలని.. వదంతుల వ్యాప్తిని కట్టడి చేయాలని రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర మత్స్య

బర్డ్‌ఫ్లూపై వదంతులను అరికట్టండి

రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం

కేరళలో నియంత్రణ చర్యలు పూర్తి

తెలంగాణ కిర్గుల్‌లో 800 కోళ్లు మృతి

రానికేట్‌ వ్యాధి అంటున్న వైద్యులు

గిరిజన గ్రామాల్లో కోళ్లు మృత్యువాత


 న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి)/బోథ్‌ రూరల్‌/బాసర, జనవరి 10: బర్డ్‌ ఫ్లూ వైరస్‌ పై ప్రజలకు అవగాహన కల్పించాలని.. వదంతుల వ్యాప్తిని కట్టడి చేయాలని రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నీటి వనరులు, మాంసాహార మార్కెట్లు, జంతు ప్రదర్శనశాలలు, పౌల్ర్టీఫాంలపై నిఘా పటిష్ఠం చేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఒక కేంద్ర బృందం కేరళలో పర్యటిస్తోంది. వ్యాధి సంక్రమణపైదర్యాప్తు చేస్తోంది. మరో బృందం హిమాచల్‌ప్రదేశ్‌కు ఆదివారం చేరుకొంది. ఛత్తీ్‌సగఢ్‌లో వైరస్‌ నిర్ధారణ కాలేదు


. మహారాష్ట్రకు సంబంధించి వైద్య పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది. కేరళలో తీవ్ర ప్రభావిత రెండు జిల్లాల్లో నియంత్రణ చర్యలు పూర్తయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని   జంతు ప్రదర్శనశాలలను సెంట్రల్‌ జూ అథారిటీ ఆదేశించింది. మహారాష్ట్ర లాతూర్‌లోని అహ్మద్‌పూర్‌ ప్రాంతంలో రెండు రోజుల్లో 128 కోళ్లతోసహా 180 పక్షులు మృత్యువాత పడ్డాయి.  హిమాచల్‌లోని పాంగ్‌ డ్యాం వద్ద  60 కాకులతో సహా ఆదివారం 275 పక్షులు మరణించాయి. 


తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండల పరిధి గిరిజన గ్రామాల్లో అంతుచిక్కని వ్యాధితో వందలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. పార్డి(కె), మామిడిగూడ, గొల్లపూర్‌, వజ్జర్‌ గ్రామాల్లో రెండు మూడు రోజులుగా కోళ్లు మృతి చెందుతున్నాయని స్థానికులు తెలిపారు.

నిర్మల్‌ జిల్లా బాసర మండలం కిర్గుల్‌(బి), నిజామాబాద్‌ జిల్లా బాసరలో వందలాది కోళ్లు చనిపోతున్నాయి. కాగా, బర్డ్‌ ఫ్లూ లక్షణాలేవీ లేవని.. ఇది రానికేట్‌ వ్యాధి అని పశువైద్యాధికారి రవీందర్‌ చెప్పారు.


Updated Date - 2021-01-11T06:51:03+05:30 IST