సత్ఫలితాలిస్తున్న చెక్‌డ్యాంలు

ABN , First Publish Date - 2021-07-26T06:40:24+05:30 IST

వాగుల్లోంచి వృథాగా వెళ్లే నీటికి అడ్డుకట్ట వేయడానికి నిర్మించిన చెక్‌ డ్యాంలు సత్ఫలితాలిస్తున్నాయి.

సత్ఫలితాలిస్తున్న చెక్‌డ్యాంలు
కోరుట్ల మండలంలోని సర్పారాజ్‌పూర్‌ వద్ద నిర్మించిన చెక్‌ డ్యాం


- జిల్లాలో రూ. 331 కోట్లతో నిర్మాణం

- వాగుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు

జగిత్యాల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): వాగుల్లోంచి వృథాగా వెళ్లే నీటికి అడ్డుకట్ట వేయడానికి నిర్మించిన చెక్‌ డ్యాంలు సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల రూ. 331 కోట్ల వ్యయంతో 75 చెక్‌ డ్యాంలను వివిధ ప్రాంతాల్లో నిర్మించారు. అధిక మొత్తంలో చెక్‌ డ్యాం పనులు పూర్తయ్యాయి. ఇందులో కొన్ని మాత్రమే పూర్తి  కాలేదు. ప్రస్తుత సీజన్‌లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. వాగుల మద్యలో చెక్‌ డ్యాంలు నిర్మించడం వల్ల నీరు వృథాగా వెళ్లకుండా అడ్డుకట్ట పడుతోంది. దీంతో వాగుల్లో వరద నీరు నిల్వ ఉంటోంది. వాగుల్లో నిర్మించిన చెక్‌ డ్యాంల వల్ల జిల్లాలో దాదాపుగా మూడు టీఎంసీల నీరు అదనంగా నిల్వ ఉంటుందన్న అంచనాలున్నాయి. సుమా రు 30 వేల ఎకరాలకు అదనంగా సాగు నీరు అందుతోంది.

- విరివిగా నిర్మాణాలు..

అయిదు నియోజకవర్గాల్లో 75 చెక్‌ డ్యాంలను ఏడాది కాల వ్యవధిలో నిర్మించారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.331 కోట్ల నిధులను కేటాయించింది. జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో గల అనంతారం వాగులో రూ. 25.53 కోట్ల నిధులతో 12 చెక్‌ డ్యాంలను, పెద్దవాగులో రూ. 77.71 కోట్ల నిధులతో 9, సదజల వాగులో రూ. 6.90కోట్ల నిధులతో రెండు చెక్‌ డ్యాంలను నిర్మించారు. 

కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి-కోరుట్ల పెద్దవాగు రూ. 55.50 కోట్ల నిధులతో 17 చెక్‌ డ్యాంలను నిర్మించారు. చొప్పదండి నియోజకవర్గంలోని పూడూరు వాగులో రూ. 84.85 కోట్ల నిధులతో 17, ధర్మపురి నియోజకవర్గంలోని సదజల వాగులో రూ. 44.95 కోట్ల నిధులతో తొమ్మిది, పెద్దవాగులో రూ. 24.65 కోట్ల నిధులతో నాలుగు, జంగల్‌ నాలా రూ. 3.5 కోట్ల నిధులతో ఒక చెక్‌ డ్యాంను నిర్మించారు. 

- నిల్వ నీటితో మరింత మేలు..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల వాగుల్లో పారే నీటికి అడ్డుకట్ట వేయడానికి నిర్మించిన చెక్‌ డ్యాం వల్ల నీటి నిల్వలు ఎక్కువగా ఉండనున్నాయి. దీంతో వాగులకు ఇరువైపుల కొద్ది దూరం పాటు భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. సంవత్సరమంతా వాగుల్లో నిల్వ ఉండే నీటిని రైతులు మోటార్ల ద్వారా పంటలకు మళ్లించుకునే అవకాశాలున్నాయి. వాగు కట్టలకు ఇరువైపులా గ్రావిటీ కాలువలను తవ్వి పంటలకు సాగు నీరు అందే వీలుంటుంది. వాగుల్లో చెక్‌ డ్యాంలతో అడ్డుకట్టలు కట్టడం వల్ల నీటి నిల్వలుండడంతో పాటు వరద ముంపు సైతం తగ్గుతుంది. చెక్‌ డ్యాం నిర్మించిన ప్రతీ ప్రాంతంలోనూ నాలుగు నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు నీరు నిలిచి ఉంటోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో చేపల పెంపకం సైతం జరుపుకోవడానికి వీలుంటుంది.

- గోదావరిలోకి వృథాగా వెళ్లే జలాలకు చెక్‌..

జిల్లాలో ప్రతీ యేటా సగటున 950 మిల్లీమీటర్ల వర్షం కురుస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లో గల వాగులు సీజన్‌లో నీటితో కళకళలాడుతుంటాయి. వరద నీరు ఎక్కువయిన సందర్భాల్లో వాగుల్లో నుంచి నీరు వృథాగా గోదావరిలోకి వెళ్తోంది. వృథాగా వెళ్లే జలాలను నివారించడానికి అనుగుణంగా అడ్డుకట్టలను నిర్మించారు. దీంతో గోదావరిలోకి వెళ్లే మిగులు జలాలు వాగుల్లోనే పలు ప్రాంతాల్లో నిల్వ ఉండే అవకాశాలున్నా యి. వాగుల్లో చెక్‌ డ్యాంల వద్ద నిల్వ ఉన్న నీటిని అవసరాలను బట్టి స్థానికులు సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి. 

- మరిన్ని నిర్మిస్తే.. 

జిల్లాలోని  380 గ్రామ పంచాయతీల పరిధిలో పలు ప్రాంతాల్లో గల వాగుల్లో మరిన్ని చెక్‌ డ్యాంలను నిర్మిస్తే మేలు జరుగుతుందని అన్నదాతలు భావిస్తున్నారు. జిల్లాలో మరో సుమారు 200 చెక్‌ డ్యాంలు అవసరమవుతాయన్న అంచనాలున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని రైతాంగం కోరుతోంది. చెక్‌ డ్యాంల నిర్మాణం వల్ల బహుళ ప్రయోజనాలు అందుతుండడంతో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్‌ ఉంది. 


Updated Date - 2021-07-26T06:40:24+05:30 IST