కుడకుడ రెడ్జోన్లో డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ
ABN , First Publish Date - 2020-04-05T09:57:40+05:30 IST
ఢిల్లీ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొన్న కుడకుడ కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం
చివ్వెంల, ఏప్రిల్ 4: ఢిల్లీ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొన్న కుడకుడ కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం ఈ ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించింది. అతడితో సంబంధాలున్న వ్యక్తులను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కుడకుడ రహదారులను శనివారం కూడా మూసివేసి మూడంచెల భద్ర త ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించగా, ఎస్పీ ఆర్.భాస్కరన్ పర్యవేక్షించారు.
పాజిటివ్ వ్యక్తితో నేరుగా సంబంధమున్న 33 మందిని ప్రభుత్వ క్వారంటైన్కు తరలించగా, పరోక్షంగా సంబంధమున్న 47 మందిని హోంక్వారంటైన్లో ఉంచారు. 33మంది స్వాప్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. కుడకుడలోని రెండు వేల ఇళ్లకు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. దీన్ని ఆర్డీవో మోహన్రావు, డీఎస్పీ నాగేశ్వరరావు, తహసీల్దార్ పులి సైదులు, వైద్యాధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షించారు. అదేవిధంగా అనుమానితులు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రచారం నిర్వహించారు.
అనుమానితులు క్వారంటైన్కు
సూర్యాపేట: కుడకుడలో అనుమానితులను ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించడంతోపాటు, పలువురిని హోంక్వారంటైన్ చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి కిలో మీటర్ మేర పోలీసులు దిగ్బంధించా రు. ఆ ప్రాంతంలోని ఇళ్లకు నిత్యావసర సరుకులు అధికారులే పంపిణీ చేస్తున్నారు. అనుమానితులైన ఐదుగురి స్వాప్ నమూనాలను పరీక్షలకు పంపించారు. ప్రస్తుతం ఇమాంపేట, చందన నర్సింగ్ కళాశాల, టీఎస్ మోడల్ స్కూల్లో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో 62మంది ఉన్నారు. పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తిని కలిసిన 63 మందిని గుర్తించారు. వీరందరినీ 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంచారు.