స్విమ్స్లో తప్పిన పెను ప్రమాదం
ABN , First Publish Date - 2021-05-13T14:31:48+05:30 IST
నగరంలోని స్విమ్స్ ఆసుపత్రిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
తిరుపతి: నగరంలోని స్విమ్స్ ఆసుపత్రిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం తెల్లవారుజామున ఆక్సిజన్ నిల్వలు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. దీంతో వెంటనే తెల్లవారుజమున 4 గంటలకు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మకు గ్యాస్ ఆపరేటర్లు సమాచారం అందించారు. వెనువెంటనే కలెక్టర్కు వెంగమ్మ ఫోన్ చేసి విషయం తెలియజేశారు. అయితే చెన్నై నుంచి ట్యాంకర్ మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఏర్పేడు శ్రీకృష్ణ గ్యాస్ ఏజెన్సీస్ని ఆక్సిజన్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఏర్పేడు ప్లాంట్కి మాత్రమే ట్యాంకర్ వెసులుబాటు ఉంది. అర్బన్ ఎస్పీ వెంకటఅప్పల నాయుడుకి వెంగమ్మ ఫోన్ చేయగా... వెంటనే ట్యాంకర్ త్వరితగతిన తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్తో ట్రాఫిక్ లేకుండా పోలీస్ వాహనాల్తో ఆక్సిజన్ను స్విమ్స్కు తరలించారు. 25 నిమిషాల్లోనే ఏర్పేడు నుంచి స్వీమ్స్కి ట్యాంకర్ వచ్చి చేరింది. ఆక్సిజన్ను స్టోరేజ్ ట్యాంక్లో నింపడటంతో కలెక్టర్, ఎస్పీ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రుయా ఘటన నేపథ్యంలో స్విమ్స్లో సినిమాను తలదన్నే హై డ్రామా చోటు చేసుకుంది. రుయాలోనూ ఇలాగే చేసి ఉంటే ప్రాణాలు దక్కేవని ప్రజలు అంటున్నారు. స్విమ్స్ సిబ్బంది అప్రమత్తతే ప్రాణాలు కాపాడిందని స్విమ్స్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.