చర్చల్లో శశికళ, అన్నాడీఎంకే.. మధ్యవర్తి బీజేపీ!
ABN , First Publish Date - 2020-09-23T23:00:28+05:30 IST
వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐడీఎంకే కూటమిని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది.....
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐడీఎంకే కూటమిని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే పార్టీకి శశికళకు మధ్య సయోధ్య కుదుర్చడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ చర్చలకు భారతీయ జనతా పార్టీ మధ్యవర్తిత్వం వహించనుంది. రెండు రోజుల క్రితం శశికళ మేనల్లుడు, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎమ్ఎమ్కే) పార్టీతో బీజేపీ చర్చలు జరిపింది.
జనవరి 2021 లోపు శశికళ జైలు నుంచి విడుదల అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దినకరన్తో బీజేపీ చర్చలు ఫలవంతం అయితే బెంగుళూరు జైలులో ఉన్న శశికళను మరింత తొందరగా విడుదలయ్యేందుకు ప్రయత్నిస్తానని దినకరన్ అన్నట్లు సమాచారం. ఆమెకు పార్టీ జనరల్ సెక్రెటరీ బాధ్యతలు అప్పగించాలని దినకరన్ అనుకుంటున్నారట. అనంతరం, అన్నాడీఎంకే పార్టీ కీలక నేతలుగా ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామితో, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో చర్చలు కొనసాగనున్నాయి.
‘‘అమ్మ(జయలలిత) మరణం తరువాత పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. చాలా చర్చలు ఆగిపోయాయి. అయితే బీజేపీ ఈ లోటును భర్తీ చేసింది. త్వరలోనే శశికళ జైలు నుంచి విడుదల కానుంది. శశికళ సహాయంతో ఎడప్పాడి లాభపడనున్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయంపై ఆసక్తితో ఉన్నారు. ఈ విలీనం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది’’ అని తమిళనాడుకు చెందిన ఓ మంత్రి అన్నారు.
వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ఏఐడీఎంకే.. ద్వితీయార్థంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంది. జయలలిత మరణం అనంతరం పార్టీలో వచ్చిన చీలికలు.. పార్టీని అధికారం నుంచి దూరం చేస్తుందా అనేంత వరకూ వెళ్లాయి. శశికళపై సొంత పార్టీలో తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే శశికళ జైలుకు వెళ్లిన అనంతరం ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నాయి. కాగా, శశికళ మేనల్లుడు అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎమ్ఎమ్కే) అనే పేరుతో కొత్త పార్టీ పెట్టి జయలలిత స్థానంలో విజయఢంకా మోగించారు.