రాజధాని రైతులపై కేసులు దారుణం
ABN , First Publish Date - 2020-10-30T04:39:17+05:30 IST
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేయడంపై తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
భీమవరం, అక్టోబరు 29 : రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేయడంపై తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్నం పెట్టే రైతన్నలకు సంకెళ్లు వేయడం సరికాదన్నారు. మైలాబత్తుల ఐజాక్బాబు మాట్లాడుతూ అక్రమ కేసులతో దళితులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఉప్పులూరి చంద్రశేఖర్, గంటా త్రిమూర్తులు, ఈపి శేషు, మరపట్ల శ్యాంబాబు, మైలాబత్తుల విల్సన్ బాబు, మల్లువలస రాము, తదితర నాయకులు పాల్గొన్నారు.
అక్రమ కేసులు ఉపసంహరించాలి
ఆకివీడు: రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతు కూలీలపై అక్రమ కేసులు తక్షణమే ఉపసంహరించాలని టీడీపీ మండల అధ్యక్షుడు మోటుపల్లి రామవర ప్రసాద్ డిమాండ్ చేశారు. రాజధాన ప్రాంతంలో రైతులకు పోలీసులు బేడీలు వేయడం దారుణమన్నారు. శాంతియుతంగా పోరాడుతున్న రైతులకు స్వేచ్ఛనివ్వాలంటూ గురువారం తహసీల్దార్ జీజే సూర్యకుమార్కు వినతిపత్రం అందజేశారు. రాజధానికి భూములిచ్చిన దళిత, బీసీ రైతులపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి ఇనుప సంకెళ్లు వేయడం అమానుషం అన్నారు. దళిత, బీసీ రైతులకు సంకెళ్లు వేసి అమానుషంగా వ్యవహరించిన డీఎస్పీనీ సస్పెండ్ చేయాలన్నారు. శాంతియుతంగా పోరాడుతున్న రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలపై అణచివేత చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలకు, రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, మైనార్టీ నేత ఎండీ జాకీర్ ఉన్నారు.