టీడీపీ బీసీనేతలపై విజయసాయి, అవంతి కుట్ర: బుద్దవెంకన్న
ABN , First Publish Date - 2021-06-15T17:51:09+05:30 IST
ఉత్తరాంధ్ర, విశాఖ కేంద్రంగా విజయసాయి, అవంతి శ్రీనివాస్ టీడీపీ బీసీ నేతలపై కుట్ర రాజకీయాలు, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న
అమరావతి: ఉత్తరాంధ్ర, విశాఖ కేంద్రంగా విజయసాయి, అవంతి శ్రీనివాస్ టీడీపీ బీసీ నేతలపై కుట్ర రాజకీయాలు, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి అల్లుడు వైసీపీలో చేరమని పల్లా శ్రీనివాసరావుని అడిగితే నిరాకరించారని తెలిపారు. విశాఖలో అధికార పార్టీకి పట్టులేదని, టీడీపీలోని బీసీ నేతలను బెదిరిస్తూ, వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన వెంటనే విజయసాయి విశాఖ ఎంపీగా పోటీ చేసి, ప్రజల్లో తనకున్నఆదరణ రుజువు చేసుకోవాలని సవాల్ చేశారు. దొంగలు, దోపిడీదారులు, కబ్జాకోరులు వైసీపీలో ఉంటే, టీడీపీ వారిని కబ్జాకోరులంటారా అని ప్రశ్నించారు. బయటినుంచి వచ్చిన విజయసాయి, అవంతి విశాఖవాసులను అమాయకుల్నిచేసి చెడుగుడు ఆడుతున్నారని మండిపడ్డారు.
పల్లా నిజంగా భూములు ఆక్రమించుకుంటే, అతని వద్ద ఉన్నఆధారాలను పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయసాయి నేతృత్వంలో జరిగిన కబ్జాల భరతం పడతామని హెచ్చరించారు. విజయసాయి, అవంతి సహా ప్రతి ఒక్కరికీ ఒకటికి, ఒకటిన్నర తిరిగిస్తామన్నారు. కరోనా దెబ్బకు తోడు, జగన్ దెబ్బతో రాష్ట్రం కుదేలైందన్నారు. నిరుద్యోగం, పేదరికం పెరిగి, ఆకలిచావుల దిశగా రాష్ట్రం సాగుతోందని తెలిపారు. రాష్ట్ర, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా భూకబ్జాలు, దోపిడీనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.