బీసీలను కట్టుబానిసలుగా మార్చాలని యత్నం: కొల్లురవీంద్ర

ABN , First Publish Date - 2021-06-03T18:41:13+05:30 IST

జగన్ మోహన్ రెడ్డి బీసీలను కట్టుబానిసలుగా మార్చాలని చూస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లురవీంద్ర విమర్శించారు.

బీసీలను కట్టుబానిసలుగా మార్చాలని యత్నం: కొల్లురవీంద్ర

అమరావతి: జగన్ మోహన్ రెడ్డి బీసీలను కట్టుబానిసలుగా మార్చాలని చూస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లురవీంద్ర విమర్శించారు. బాంచన్ దొరా అని వైసీపీ నేతలు, వాలంటీర్లు చుట్టూ బీసీలంతా తిరిగేలా చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో బీసీల సంక్షేమం కేవలం కాగితాలు, అంకెలకే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి హాయాంలో, ఆదరణ కింద చేతి, కులవృత్తుల వారికి 90శాతం సబ్సిడీపై పరికరాలు, యంత్రాలు అందించారని గుర్తుచేశారు. విదేశాలకు వెళ్లి చదువుకునే బీసీ యువతకు రూ.15లక్షల వరకు అందించారని ఆయన తెలిపారు. స్టడీ సర్కిళ్లు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, బీసీ నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ అందించారన్నారు. మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీపై వలలు, పడవలు, మరబోట్లు, మోపెడ్లు అందించారని తెలిపారు. బీసీ భవన్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఒక్కో నియోజకవర్గానికి రూ.50లక్షలు కేటాయించారని చెప్పారు. 2018-19లో బీసీల సంక్షేమానికి రూ.16,226 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు.


జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలను విడదీసి పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు ఐక్యంగా ఉంటే తన ఆటలు సాగవని భయపడుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకత్వాన్ని అణిచేసి, బీసీలు ఎల్లకాలం కింది స్థాయిలోనే ఉండేలా చేస్తున్నారని కొల్లురవీంద్ర అన్నారు. జగన్ ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లు అడ్రస్ లేనివిగా మిగిలిపోయాయని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రతి బీసీ కార్పొరేషన్ , ఫెడరేషన్‌కు ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తే, ఈ ముఖ్యమంత్రి బీసీ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉంటే, ముఖ్యమంత్రి వేలల్లో అరకొర సాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించింది జగన్మోహన్  రెడ్డే అని అన్నారు.


దాని వల్ల బీసీలు రాష్ట్రంలో 16,800 స్థానిక సంస్థల పదవులను కోల్పోయారని తెలిపారు. నామినేటెడ్ పదవులు, యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో జగన్‌కు బీసీలు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్, ఏపీఐఐసీ చైర్మన్ వంటివి టీడీపీ హయాంలో బీసీలకే దక్కాయన్నారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమలరామకృష్ణుడు సహా, తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. అవసరమైతే బీసీలు పస్తులుంటారు గానీ, ఆత్మాభిమానం చంపుకోరనే వాస్తవాన్ని జగన్ తెలుసుకోవాలని కొల్లురవీంద్ర హితవుపలికారు.

Updated Date - 2021-06-03T18:41:13+05:30 IST