విజయవాడ టీడీపీలో విభేదాలపై ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-03-03T18:58:53+05:30 IST

విజయవాడ టీడీపీ నెలకొన్న విభేదాలపై ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ టీడీపీలో విభేదాలపై ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడ: విజయవాడ టీడీపీ నెలకొన్న విభేదాలపై ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబం అన్న తర్వాత రకరకాల మనస్తత్వాలుంటాయని.. ఇవన్నీ కామన్ అని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీలో విభేదాలు లేవా.. షర్మిలకు, జగన్‌కు, తల్లికి విభేదాలు లేవా అని వ్యాఖ్యలు చేశారు. ‘‘అన్నొక పార్టీ పెట్టారు.. చెల్లి షర్మిల ఒక పార్టీ పెట్టారు.. వాళ్లకున్నాయిగా విభేదాలు.. ఇవన్నీ మాములే’’ అని అన్నారు. ఒక కుటుంబమన్నాక సహజంగా విభేదాలుంటాయని.. రాజకీయాల్లో ఏముంది అని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ఎంపీ ప్రశ్నించారు. జగన్‌కు అంత కాన్ఫిడెన్స్ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో కచ్చితంగా తాము కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు.


ఏపీలోని మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 75 నుంచి 80 శాతానికిపైగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోబోతుందన్నారు. విజయవాడలో 64 డివిజన్లు ఉంటే అందులో 45 నుంచి 50 వరకు టీడీపీకే వస్తాయని తెలిపారు.  ఏపీ సీఎం వైఎస్ జగన్ తన 20 నెలల పాలనలో అతనిపై అతనికే నమ్మకంలేదని... అందుకే టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఒక్క విజయవాడలోనే టీడీపీ అభ్యర్థులు ధైర్యంగా నిలబడగలిగారన్నారు. విజయవాడలోని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరు కూడా నామినేషన్లు ఉపసంహరణకు లొంగేవారు కాదని చెప్పారు. తమ విజయవాడలో అందరూ ఫైటర్సే అని అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని వ్యాఖ్యానించారు. భయపెట్టడం, డబ్బులు ఆశచూపి లోబర్చుకోవడం, రకరకాలుగా ఏదో విధంగా ప్రలోభాలు గురిచేయడం, పోలీసులను అడ్డంపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం చేస్తున్నారన్నారు. జగన్‌పై జగన్‌కే నమ్మకంలేకనే ఇదంతా చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-03-03T18:58:53+05:30 IST