వీడిన ఉత్కంఠ
ABN , First Publish Date - 2022-01-15T06:30:50+05:30 IST
కోడి పందేలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది.
యథేచ్ఛగా కోడి పందేలు, జూదం
చేతులు మారిన కోట్లు
కోడి పందేలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం కోడి పందేలు యథేచ్ఛగా జరిగాయి. పందెగాళ్లు రెచ్చిపోయారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. కోడిపందేలతో పాటు ఇతర గుండాట, పేకాట తదితర జూదక్రీడలు నిర్వహించారు. బరుల వద్ద పలావు, కోడి పకోడి తదితర విక్రయాలు జరిగాయి.
నిడదవోలు, జనవరి 14: నిడదవోలు పట్టణంతో పాటు గ్రామాల్లో కోడి పందేలు శుక్రవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. మండలంలో విజ్జేశ్వరం డి.ముప్పవరం, కోరుమామిడి, కాటకూటేశ్వరం, తాడిమళ్ళ, శింగ వరంలో జోరుగా ప్రారంభమయ్యాయి. ఒక సర్పంచ్ తన బంధువర్గంతో కలసి పందేలను వీక్షించారు.
తణుకు: శుక్రవారం ఉదయం నుంచే తణుకు, దువ్వ తదితర ప్రాంతాల్లో కోడి పందేలు, గుండాట మొదలయ్యాయి. కొన్ని చోట్ల సాయంత్రం వర్షం రావడంతో పందేలకు అంతరాయం ఏర్పడింది.
ఇరగవరం: తూర్పువిప్పర్రు, కత్తవపాడు, రేలంగి, అయినపర్రు, ఓగిడి గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. నిర్వాహకులు రాత్రి పూట ఫ్లడ్లైట్లు ఏర్పాటుచేసి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఒక్కొక్క బరిలో సుమారు వంద కోళ్ల వరకు తెగిపడ్డాయి. కోజా మాంసం కోసం జనం ఎగబడ్డారు. బరుల వద్ద చికెన్ పకోడి, పలావ్, కూల్డ్రింక్స్ అధిక ధరలకు విక్రయించారు.
అత్తిలి: మండలంలో కోడిపందేలు జోరుగా సాగాయి. వీటిని తిలకిం చేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
తాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం పట్టణం, మండలంలో కోడి పందేలు జోరుగా సాగాయి. నిర్వాహకులు ముందుగానే సిద్ధం చేసిన బరు ల్లోకి కోళ్లను దింపి కోళ్లకు కత్తులతో పందేలకు సై అన్నారు. పట్టణంలో రెం డు చోట్ల, మండలంలో పది చోట్ల బరులు వేశారు. కోతాట, గుండాట తదితర జూదాలు జోరుగా సాగాయి. భోగి రోజున సుమారు రూ. 2 కోట్లు చేతులు మారి ఉంటాయని అంచనా.
పెంటపాడు: మండలంలో పెంటపాడు, పడమరవిప్పర్రు, చింతపల్లి, బీ.కొండేపాడు, మీనవల్లూరు, అలంపురం, ప్రత్తిపాడు, రాచర్ల, దర్శిపర్రు, జట్లపాలెం గ్రామాల్లో కోడి పందేల బరులు వెలిశాయి. గుండాట, పేకాట జోరుగా సాగాయి. బరుల వద్ద మద్యం ఏరులై పారింది.
ఉండ్రాజవరం: మండలంలో మూడు గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు. అయితే శుక్రవారం నాడు చెదురు మదురుగా వర్షం పడటంతో కోడిపందేలను మధ్యమధ్యలో ఆపివేశారు.
నిడమర్రు: పెదనిండ్రకొలను, తోకలపల్లి తదితర గ్రామాల్లో పందేలు జరిగాయి. మందలపర్రు బరిలో అత్యున్నత పందెం రూ. 27.18 లక్షలకు సాగి నట్టు సమాచారం. సినిమా సెట్టింగులు, భారీ హంగామాతో మందలపర్రు హైలైట్గా నిలిచింది. తొలిరోజు 36 పందేలు జరిగినట్టు సమాచారం. కోట్ల రూపాయల సొమ్ము చేతులు మారింది.
ఉంగుటూరు: ఉంగుటూరు, నారాయణపురం, కైకరం, అక్కుపల్లి గోకవరం, గొల్లగూడెం, రాచూరు తదితర గ్రామాలలో కోడి పందేలు జోరుగా సాగాయి. గుండాటలు, కోతాట జరిగాయి.