క్యాన్సర్‌తో టెన్త్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-08-04T06:09:15+05:30 IST

మండలంలోని దిబ్బపాలెంలో క్యాన్సర్‌తో పదో తరగతి విద్యార్థి దారపు అచ్చెన్నాయుడు సోమవారం సాయంత్రం మృతి చెందాడు.

క్యాన్సర్‌తో టెన్త్‌ విద్యార్థి మృతి
దారపు అచ్చెన్నాయుడు(ఫైల్‌)


దిబ్బపాలెంలో విషాదం

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి

చీడికాడ, ఆగస్టు 3: మండలంలోని దిబ్బపాలెంలో క్యాన్సర్‌తో పదో తరగతి విద్యార్థి దారపు అచ్చెన్నాయుడు సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దిబ్బపాలెం గ్రామానికి చెందిన దారపు ఈశ్వరరావు, కొండమ్మ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు దారపు అచ్చెన్నాయుడు ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ప్రతీ తరగతిలోను ప్రథమ స్థానంలో నిలిచేవాడు. ఈ ఏడాది పదవ తరగతి పాసైన అచ్చెన్నాయుడుకు ఆరోగ్యం బాగోలేదని విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా లంగ్‌ క్యాన్సర్‌ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. తొలుత అగనంపూడి ఆస్పత్రిలోను, తర్వాత హైదరాబాద్‌లోను వైద్యం చేయించిన తల్లిదండ్రులు చివరకు ముంబాయి తీసుకు వెళ్లి ఆపరేషన్‌ కూడా చేయించారు. అనంతరం నెల రోజులుగా ఇంటి వద్ద మందులు వేసుకుంటూ బాగానే ఉన్నాడు. ఇంతలో సోమవారం సాయంత్రం ఆకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు వెంటనే దిబ్బపాలెం వెళ్లి మృతుని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.  

Updated Date - 2021-08-04T06:09:15+05:30 IST