టీకాతోనే కరోనాను ఎదుర్కోగలం
ABN , First Publish Date - 2021-10-22T05:10:32+05:30 IST
వ్యాక్సిన్పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తద్వారా కరోనా ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొగలుగుతామని కలెక్టర్ జి రవి పేర్కొన్నారు.
- కలెక్టర్ జి.రవి
- గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాల తనిఖీ
మల్యాల, అక్టోబరు 21: వ్యాక్సిన్పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తద్వారా కరోనా ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొగలుగుతామని కలెక్టర్ జి రవి పేర్కొన్నారు. మల్యాల మండలంలోని గొల్లపల్లె, నూకపల్లిలో వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు ఇళ్లను సందర్శించి ప్రజలు, వైద్య సిబ్బంది నుంచి వ్యాక్సినేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. టీకాతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏమైనా అపోహలు ఉంటే వైద్యాధికారుల ద్వారా వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. 18సంవత్సరాలు నిండిన వారంతా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలో టీకాలు వేసుకోవాలన్నారు. తేలికపాటి అనారోగ్య సమస్యలతో భాధపడేవారిని పరిశీలించి వారికి అవగాహన కల్పించి టీకా అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. టీకాలపై ఇంటింటా సర్వే చేసి స్టిక్కర్లను అతికించాలన్నారు. వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో కొవిడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వ్యాక్సిన్పై సరైన నివేదికలు తయారు చేయాలని ప్రతీ రోజు సాయంత్రం వ్యాక్సినేషన్పై అధికారులతో సమీక్షస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో శ్రీధర్, సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అనంతరం మల్యాల, ముత్యంపేటలో వ్యాక్సినేషన్ కేంద్రాలను డీఎంహెచ్వో పరిశీలించారు.