రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2021-08-02T04:57:30+05:30 IST

తమ్మినాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
హేమంత్‌(ఫైల్‌)


ఎచ్చెర్ల, ఆగస్టు 1: తమ్మినాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. శ్రీకాకుళం రూరల్‌ మండలం చింతాడకు చెందిన జగలంకి అప్పన్న, బోర హేమంత్‌కుమార్‌ (17)లు ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం సింహద్వారం సమీపంలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో జరుగుతున్న ఫంక్షన్‌కు బయలుదేరారు. తమ్మినాయుడుపేట వద్ద  వీరి వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది.  బైక్‌ను నడుపుతున్న అప్పన్న గాయాలతో బయటపడగా.. వెనుక కూర్చొన్న హేమంత్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. హేమంత్‌ మృతదేహం నుజ్జును జ్జయింది. హేమంత్‌కు తల్లి రాధ, తండ్రి రామారావు, ఓ చెల్లి ఉంది. ఈ ఏడాదే ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించాడు. ఒక్కగానొక్క కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. అయితే, లారీ రూపంలో కుమారుడిని మృత్యువు కబళించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హేమంత్‌ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.


 



Updated Date - 2021-08-02T04:57:30+05:30 IST