వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-08-02T06:30:24+05:30 IST
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన ఆదివారం తిరుపతి రూరల్లో జరిగింది.
ప్రమాదంపై అనుమానాలు?
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 1: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన ఆదివారం తిరుపతి రూరల్లో జరిగింది. ఎంఆర్పల్లె ఎస్ఐ దీపిక తెలిపిన వివరాల మేరకు.. పీలేరు సమీపంలోని మఠంపల్లెకు చెందిన వరుణ్తేజ్ (25) నాలుగు రోజులక్రితం చంద్రగిరి మండలం అగరాలలోని తన చిన్నమ్మ ఇంటికి వచ్చాడు. పిన్ని కుమార్తె దాక్షాయణికి ఆదివారం డిగ్రీ పరీక్ష ఉండటంతో ఆమెతో కలిసి తిరుపతిలోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. పూతలపట్టు-రేణిగుంట జాతీయ రహదారిలో పేరూరు వద్ద వెనుకనుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. వాహనం నడుపుతున్న వరుణ్తేజ్ తల, ముఖానికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దాక్షాయణి స్వల్ప గాయాలతో బయటపడింది. 108 సిబ్బంది బాధితురాలిని రుయాకు తరలించారు. ఇదిలా ఉంటే.. వరుణ్తేజ్ మృతిపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే తమను వెనుకనుంచి ఏ వాహనం ఢీకొట్టిందో బాధితురాలు చెప్పలేక పోతున్నారని ఎస్ఐ తెలిపారు. కాగా.. శనివారం అగరాలలో కొందరు వ్యక్తులు ఓ వివాదం విషయమై వరుణ్తేజ్పై దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. వారే వాహన ప్రమాదం రూపంలో హత్య చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.