కట్నం ఇవ్వొద్దు.. బాలికల హాస్టల్‌ కట్టించు

ABN , First Publish Date - 2021-11-26T08:55:17+05:30 IST

రాజస్థాన్‌ కు చెందిన ఓ యువతి తన పెళ్లికి కట్నంగా ఇచ్చేందుకు తల్లిదండ్రులు దాచిన సొమ్మును బాలికల హాస్టల్‌కు విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచింది. అదీ.. ఏ లక్షో..

కట్నం ఇవ్వొద్దు.. బాలికల హాస్టల్‌ కట్టించు

  • వధువు ఆదర్శం.. విరాళంగా కట్నం సొమ్ము 75 లక్షలు


బార్మర్‌ (రాజస్థాన్‌), నవంబరు 25: రాజస్థాన్‌ కు చెందిన ఓ యువతి తన పెళ్లికి కట్నంగా ఇచ్చేందుకు తల్లిదండ్రులు దాచిన సొమ్మును బాలికల హాస్టల్‌కు విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచింది. అదీ.. ఏ లక్షో.. రెండు లక్షలో కాదు.. ఏకంగా రూ.75 లక్షలు. రాజస్థాన్‌లోని బార్మర్‌కు చెందిన అంజలీ కన్వర్‌కు ప్రవీణ్‌ సింగ్‌తో ఈ నెల 21న వివాహం జరిగింది. ఈ వేడుకకు ఒక్కరోజు ముందే అంజలి తన తండ్రి కిశోర్‌ సింగ్‌కు మనసులోని మాట చెప్పారు. ఆ పట్ట ణంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్మిస్తున్న బాలికల హాస్టల్‌కు తన కట్నం సొమ్మును విరాళంగా ఇవ్వాలని కోరారు. మురిసిపోయిన ఆ తండ్రి కూతురి కోర్కెను ఆమోదించారు. వివాహ వేడుక ముగిసిన వెంటనే అంజలి తన ఉద్దే శాన్ని చెబుతూ ఓ లేఖ రాసి ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మహంత్‌ ప్రతాప్‌ పురీకి అందించారు.


దాన్ని వరుడు, అతడి తరఫు బంధువులు సహా అతిథులందరూ వినేలా మహంత్‌ ప్రతాప్‌ చదివారు. వరు డు సహా అందరూ చప్పట్లు చరిచి వధువు ను అభినందించారు. అక్కడే అదే వేదిక మీద అంజలి చేతుల మీదుగా ఆమె తండ్రి రూ.75 లక్షల చెక్కును మహంత్‌కు అందించారు. ఆ చెక్కు అందుకున్న మహంత్‌.. ఇదే హాస్టల్‌ నిర్మాణానికి అంజలి తండ్రి గతంలోనూ రూ.కోటి విరాళం ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు. 

Updated Date - 2021-11-26T08:55:17+05:30 IST