భార్యపై కోపం.. విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఓ భర్త చేసిన తింగరి పని ఇది..!
ABN , First Publish Date - 2021-10-21T22:53:20+05:30 IST
తమిళనాడులో భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుని కోర్టుకు వెళ్లారు. అయితే ఇంకా విడాకులు రాకముందే.. భర్త ఓ తింగరి పని చేసి, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
భార్యపై కోపం ఉన్న వారు... చీటికీమాటికీ ఆమెను హింసించడమో, లేక అనుమానించండం వంటి పనులు చేస్తూ.. మానసిక ఆనందం పొందుతుంటారు. ఈ క్రమంలో చివరకు గొడవలు పెద్దవి చేసుకుని.. జైళ్లు, కోర్టుల వరకూ వెళ్తుంటారు. ఇలాగే తమిళనాడులో భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుని కోర్టుకు వెళ్లారు. అయితే ఇంకా విడాకులు రాకముందే.. భర్త ఓ తింగరి పని చేసి, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్కి చెందిన యువతి(32)కి.. వెళ్లియూర్ పంచాయతీ అధ్యక్షుడు సురేష్బాబు కుమారుడు ఓంకుమార్(34)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇటీవల పూందమల్లి కోర్టులో ఓంకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. భార్యపై కోపంతో ఉన్న అతను.. ఏదోటి చేసి వారి పరువు తీయాలని అనుకున్నాడు.
‘‘వరుడు కావలెను.. ఆసక్తి ఉన్న వారు వెంటనే సంప్రదించగలరు’’.. అంటూ రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొనీలో భార్య వివరాలను నమోదు చేసి, తన మామ ఫోన్ నంబర్ ఇచ్చాడు. దీంతో అప్పటి నుంచి మహిళ తండ్రికి ఫోన్ కాల్స్ రావడం ఎక్కువయ్యాయి. విసిగిపోయిన అతను.. తిరువళ్లూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేయగా విషయం మొత్తం బయటపడింది. దీంతో బుధవారం ఓంకుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.