నేటి నుంచి నగరంలో లాక్డౌన్ మరింత కఠినం
ABN , First Publish Date - 2020-07-14T11:18:14+05:30 IST
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినం అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు.
ఉదయం 6 నుంచి 11 గంటల వరకు అనుమతి..
అనవసరంగా రోడ్లపైకి వస్తే జరిమానా: జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు
అనంతపురం క్రైం, జూలై 13 : కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినం అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నగరంలోకి అనుమతిస్తామని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, తదితర అత్యవసర సేవలకు సంబంధించి ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు.
ఈ సమయంలో కూడా స్వీయ జాగ్రత్తలు పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. ఎవరైనా రోడ్లపైకి వచ్చి బలాదూర్గా తిరిగినా, గుంపులుగా కనిపించినా, మాస్కులు ధరించకపోయినా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఉదయం 11 గంటల తరువాత మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర సేవలు మినహా బయటకు వస్తే సహించమన్నారు. పోలీసులు, నగరపాలక సంస్థ విభాగాల ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందాలచే నిఘా ఉంచామన్నారు. నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.