దంపతుల హత్యకేసులో మేనల్లుడే హంతకుడు
ABN , First Publish Date - 2021-08-03T07:12:43+05:30 IST
వృద్ధ దంపతుల హత్యకేసులో వారి మేనల్లుడే హంతుకుడిగా తిరుత్తణి పోలీసుల విచారణలో తేలింది.
రామచంద్రాపురం, ఆగస్టు 2: రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి హత్యకేసులో వారి మేనల్లుడే హంతుకుడిగా తిరుత్తణి పోలీసుల విచారణలో తేలింది. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని తిరుత్తణికి చెందిన సంజీవరెడ్డి(70) ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు. ఈయన కుమారుడు దూరప్రాంతంలో ఉంటున్నారు. దీంతో ఇతడి చెల్లెలి కుమారుడు రంజిత్కుమార్ ఫైనాన్స్ వాప్యారాన్ని చూసుకుంటూ.. అన్ని విషయాల్లోనూ మామకు చేదోడువాదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో మామ ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నాడు. గతనెల 29వ తేదీన వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దామని చెప్పి అత్తమామలను కారులో తీసుకొచ్చాడు. దర్శనానంతరం తిరుత్తణికి తిరుగు ప్రయాణంకాగా.. కారులోనే సంజీవరెడ్డి, మాలతిని మెడకు తాడు బిగించి చంపేశాడు. అదే రోజు రాత్రి రామచంద్రాపురం మండలం పచ్చికాపల్లం ప్రధాన రహదారి చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో మృతదేహాలను పడేసి వెళ్లిపోయాడు. తన తల్లిదండ్రులు కనబడకపోవడంతో కుమారుడు తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రంజిత్కుమార్ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించడంతో తానే హతమార్చినట్లు అంగీకరించాడు. దీంతో తిరుత్తణి పోలీసులు నిందితుడిని తీసుకొని ఆదివారం చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో మృతదేహాలను పడేసిన ప్రదేశానికి తీసుకొచ్చారు. సోమవారం తిరుత్తణి, ఆర్సీపురం పోలీసులు సంజీవరెడ్డి బంధువుల సమక్షంలో శవపంచనామాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్సీ పురం ఎస్ఐ ఎర్రిస్వామి పర్యవేక్షించారు.