విశ్రాంత ఉద్యోగుల పాలిట శాపంగా నూతన పీఆర్సీ
ABN , First Publish Date - 2022-01-24T05:01:38+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పీఆర్సీ విశ్రాంత ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పీఆర్సీ విశ్రాంత ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా పెన్షనర్లకు ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించాలని చెప్పడం దారుణమని వాపోతున్నారు. నూతన పీఆర్సీ వల్ల పెన్షనర్లు ప్రతిఒక్కరూ రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వెనక్కి చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. పీఆర్సీ వల్ల కన్నీరే మిగిలిందని, పండుటాకుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని పలువురు సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శేషజీవితం ఆనందంగా గడుపుదామనుకున్న సమయంలో ప్రభుత్వం మనశ్శాంతి లేకుండా చేస్తోందన్నారు. రిటైర్ ఉద్యోగుల్లో 70 ఏళ్లు దాటినవారు తీసుకునే అడిషినల్ క్వాంటమ్ ఆఫ్ పింఛనులో కోత విధించడం పట్ల వృద్ధులు భారీగా నష్టపోవడమే కాకుండా తీసుకున్న పింఛనులో కోత కూడా విధించే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.