ఐరాస స్థాపన లక్ష్యం నెరవేరలేదు : సెక్రటరీ జనరల్

ABN , First Publish Date - 2022-02-26T16:34:19+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్య రాజ్య సమితి

ఐరాస స్థాపన లక్ష్యం నెరవేరలేదు : సెక్రటరీ జనరల్

ఐక్యరాజ్య సమితి : ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానం వీగిపోవడంతో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఐరాస యుద్ధం నుంచి పుట్టిందని, యుద్ధాన్ని అంతం చేయడం కోసం పుట్టిందని, నేడు ఈ లక్ష్యం నెరవేరలేదని పేర్కొన్నారు. అయితే మనం ఆశావాదాన్ని వదిలిపెట్టకూడదన్నారు. శాంతి కోసం మనం మరొక అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఏర్పాటైంది. 


ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రతిపాదించిన తీర్మానం వీగిపోయింది. ఉక్రెయిన్‌పై దాడిని వెంటనే రష్యా నిలిపేయాలని, ఉక్రెయిన్ నుంచి అన్ని దళాలను పూర్తిగా ఉపసంహరించాలని ఈ తీర్మానం ప్రతిపాదించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా వీటో చేసింది. ఇది ముందుగా ఊహించిన విషయమే. అయితే రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేయడానికి ఇది దోహదపడుతుందని అమెరికా, దాని మిత్ర పక్షాలు భావిస్తున్నాయి. ఈ తీర్మానంపై ఓటింగ్ నుంచి భారత్, చైనా, యూఏఈ గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాలన్నీ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు తీసుకెళ్తామని చెప్పాయి. రష్యాను జవాబుదారీ చేస్తామని తెలిపాయి. 


Updated Date - 2022-02-26T16:34:19+05:30 IST