పంటేదైనా ధర పాతాళంలోనే!
ABN , First Publish Date - 2021-06-09T06:00:34+05:30 IST
మరోసారి రైతన్న మార్కెట్ ధరల మాయాజాలంలో మునిగిపోయాడు.పంటేదైనా ధర లేకపోవడంతో ఒక్క రామసముద్రం మండలంలోనే టమోటా, వంగ, మిరప, కాలీఫ్లవర్, బంగాళాదుంప, క్యాబేజి, బంతిపూలు తదితర పంటలను 6 వేల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఏ పంటకు ధర లేకపోవడంతో నష్టాలను చవిచూస్తున్నారు.
మరోసారి రైతన్న మార్కెట్ ధరల మాయాజాలంలో మునిగిపోయాడు.పంటేదైనా ధర లేకపోవడంతో ఒక్క రామసముద్రం మండలంలోనే టమోటా, వంగ, మిరప, కాలీఫ్లవర్, బంగాళాదుంప, క్యాబేజి, బంతిపూలు తదితర పంటలను 6 వేల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఏ పంటకు ధర లేకపోవడంతో నష్టాలను చవిచూస్తున్నారు. సాగు ఖర్చు రూ.వంద కోట్లు నేలపాలవడంతో మరోపంటకు అప్పుల వేటలో మునిగిపోయారు.ఎకరా టమోటా సాగుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి 35 నుంచి 40 టన్నులు దిగుబడి సాధిస్తున్నారు. మదనపల్లె టమోటా మార్కెట్లో 30 కిలోల టమోటా క్రేట్ రూ.30 నుంచి 100 లోపు పలుకుతుండడంతో ఆరంభంలోనే రైతులు హడలిపోయారు. అయిన ధరలు రాకపోతాయా అనే ఆశతో పంటలను కాపాడుకున్నా పరిస్థితి మారకపోవడంతో రైతులు నిర్వేదంలో మునిగిపోయారు.కొంతమంది పంటను పొలాల్లోనే వదిలేయగా, మరికొందరు రైతులు కోతలు కోసి మార్కెట్కు తరలించి వచ్చిన అరకొర డబ్బును కూలీలకు, బాడుగలకు ఇచ్చేస్తున్నారు. 5 వేల ఎకరాల్లో టమోటా సాగు చేయగా సగం మంది కోతలు కోయకుండానే పొలాల్లోనే పంటను వదిలేశారంటే ధరల పరిస్థితి అర్థమవుతుంది. అలాగే కాలీఫ్లవర్, క్యాబేజి, వంగ, బంతిపూలు, మిరప తదితర పంటలను కోతలు కోయకుండా వదిలేశారు. 700 ఎకరాల్లో సాగు చేసిన బంతిపూలు కనీసం కిలో రూ.10కూడా పలక్కపోవడంతో పొలాల్లోనే మగ్గిపోతున్నాయి. 300 ఎకరాల్లో సాగు చేసిన రోజా పూలది కూడా అదే పరిస్థితి.
-రామసముద్రం