అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
ABN , First Publish Date - 2021-10-22T06:51:15+05:30 IST
పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఎస్పీ చేతన పేర్కొన్నారు.
నారాయణపేట క్రైం, అక్టోబరు 21 : పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఎస్పీ చేతన పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని ఽఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ ఒక్క పోలీసు తమ విధి నిర్వహణలో సమాజంలో శాంతిస్థాపనకు నిరంతరం పాటుపడాలన్నారు. సమాజంలో మత, కుల ఘర్షణలు లేకుండా శాంతియుతంగా ఉండాలన్నదే పోలీస్శాఖ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అంతకుముందు విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటించారు. నక్సల్స్ కాల్పులో అమరుడైన కానిస్టేబుల్ రాజారెడ్డి కుటుంబాన్ని ఎస్పీ పరామర్శించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు ఎస్పీ జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందించి అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భరత్కుమార్, డీఎస్పీ మధుసూదన్రావు, ఆర్ఐ కృష్ణయ్య, సీఐలు శ్రీకాంత్రెడ్డి, శివకుమార్, జనార్దన్, శంకర్, ఇఫ్తెకార్ అహ్మద్, రాంలాల్, ఎస్ఐలు సైదయ్య, గోవర్దన్, రాజు, రాములు, శివనాగేశ్వర్, ఎండీ నాసర్, నాగరాజు, పర్వతాలు, విజయభాస్కర్తో పాటు ఏఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మరికల్ : పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం మండల కేంద్రంలో ఎస్ఐ నాసర్, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు ఇందిరా గాంధీ చౌరస్తాలో ఘన నివాళి అర్పించారు. అమర వీరుల ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులు గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాల విద్యార్థులకు జాతి నిర్మాణంలో పోలీస్ పాత్ర అనే ఆంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ఎస్ఐ బహుమతులు, ప్రశంసాపత్రం అందజేశారు.
ధన్వాడ : పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా ధన్వాడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు మోడల్ స్కూల్లో జాతి నిర్మాణంలో పోలీస్ పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలైన వారికి ఎస్ఐ రాజేందర్ బహుమతులను అందించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంలు రమేష్, విజయలక్ష్మి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమాదేవి పాల్గొన్నారు.
మక్తల్ రూరల్ : పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం మక్తల్ పోలీస్ స్టేషన్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్ఐ రాములు పోలీసు సిబ్బంది, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
మాగనూర్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మాగనూర్ పోలీస్ స్టేషన్లో అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ శివనాగేశ్వర నాయుడు, ఏఎస్సై సంజీవయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.