వెళ్లొస్తాం మల్లన్నా.. వచ్చే ఏడాది మళ్లొస్తాం
ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST
భక్తుల జయజయధ్వానాలు, పోతురాజుల వీరంగం, శివసత్తుల సిగాలు, డప్పు చప్పుళ్ల హోరుతో ప్రతిధ్వనించిన కొమురవెల్లి మూగబోయింది. మూడు నెలలుగా కిటకిటలాడిన ఆలయ పరిసరాలు బోసిపోయాయి. మార్గశిరమాసం చివరి ఆది
ముగిసిన మూడునెలల మహా జాతర
చేర్యాల, ఏప్రిల్ 13: భక్తుల జయజయధ్వానాలు, పోతురాజుల వీరంగం, శివసత్తుల సిగాలు, డప్పు చప్పుళ్ల హోరుతో ప్రతిధ్వనించిన కొమురవెల్లి మూగబోయింది. మూడు నెలలుగా కిటకిటలాడిన ఆలయ పరిసరాలు బోసిపోయాయి. మార్గశిరమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని జనవరి 10న కల్యాణంతో ప్రారంభమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన అగ్నిగుండాలతో ముగిశాయి. మూడు నెలలపాటు 13 వారాలు ప్రతీ ఆదివారం సాగిన జాపపదుల మహాజాతరకు తెరపడింది. జాతరలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను తిలకించిన అనంతరం భక్తులు మూటాముల్లె సర్దుకుని వెనుదిరిగిపోయారు. మల్లన్న స్వామి వెళ్లొస్తాం.. వచ్చే ఏడాది మళ్లొస్తామని వేడుకుంటూ భక్తులు ఇంటిదారి పట్టారు.
రికార్డుస్థాయిలో హుండీ గలగల
ఈ సంవత్సరం జాతరలో ఇప్పటివరకు ఐదుసార్లు కానుకల హుండీలను లెక్కించారు. మ్లలన్న కల్యాణానికి ముందు జనవరి 2వ తేదీన లెక్కింపులో రూ.56,58,590, జనవరి 28న రూ.82,30,722, ఫిబ్రవరి 23న రూ.1,03,59,877, మార్చి18న రూ,1,02,25,727, ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మార్చి30 చేపట్టిన లెక్కింపులో రూ.43,47,983 చొప్పున మొత్తం రూ.3,88,22,899 ఆదాయం వచ్చింది. అంతేకాకుండా ఆలయానికి వేలం పాటలు, ఇతర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం లెక్కిస్తే గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.
13 వారాల బుకింగ్ ఆదాయం..
మల్లన్న కల్యాణం 13 వారాలపాటు జాతర కొనసాగింది. భక్తులు మొక్కుబడులుగా రచించిన పట్నాలు, బోనాలు, ఆర్జిత సేవలు, ప్రసాద విక్రయాలు, వసతి గదుల అద్దె తదితరాల ద్వారా 13 వారాల్లో సమకూరిన ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి..
మొదటి వారం రూ.50,95,840
2వ వారం రూ.40,16,738
3వ వారం రూ.43,41,857
4వ వారం రూ.46,23,529
5వ వారం రూ.49,25,734
6వ వారం రూ.47,62,300
7వ వారం రూ.47,62,958
8వ వారం రూ.41,55,888
9వ వారం రూ.53,08,685
10వ వారం రూ.44,93,200
11వ వారం రూ.21,75,863
12వ వారం రూ.52,31,442
13వ వారం రూ.20,89,958
మహాశివరాత్రి రూ.17,56,476