41 ఏళ్ల తర్వాత అత్యాచారం కేసులో ప్రారంభమయిన విచారణ.. ప్లీజ్.. ఆపేయండంటూ లేఖ రాసిన బాధితురాలు
ABN , First Publish Date - 2021-12-18T02:56:49+05:30 IST
అహ్మదాబాద్లో అత్యాచారం కేసులో మరీ ఆశ్చర్యంగా 41ఏళ్ల తర్వాత విచారణ ప్రారంభమైంది. నిందితులకు శిక్ష మాట అటుంచితే..
కొన్ని కేసులు చాలా కాలం పెండింగ్లో ఉంటాయి. మరికొన్ని క్లిష్టమైన కేసుల్లో అయితే ఏళ్లకు ఏళ్లు విచారణ కొనసాగుతూనే ఉంటుంది. ఈలోగా నిందితులు బెయిల్ మీద జనం మధ్యే దర్జాగా తిరుగుతూ ఉంటారు. అహ్మదాబాద్లో అత్యాచారం కేసులో మరీ ఆశ్చర్యంగా 41ఏళ్ల తర్వాత విచారణ ప్రారంభమైంది. నిందితుడికి శిక్ష మాట అటుంచితే.. బాధితురాలు మాత్రం విచారణ ఆపేయండి ప్లీజ్.. అంటూ అధికారులకు లేఖ రాసింది. వివరాల్లోకి వెళితే..
పోలీసుల కథనం మేరకు.. ముంబైకి చెందిన ఒక టాక్సీ డ్రైవర్ జూన్ 30, 1980న అహ్మదాబాద్లో విధుల్లో ఉన్నాడు. అదే రోజు ఓ మహిళ స్నేహితురాల్లో కలిసి అతడి ట్యాక్సీ ఎక్కింది. తర్వాత నుంచి ఆ మహిళలు కనపడలేదు. దీంతో మహిళ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జూలై 3న టాక్సీ డ్రైవర్ అహ్మదాబాద్ వచ్చాడు. ఆ మరుసటి రోజు పోలీసులు మహిళలను గుర్తించారు. తమను ముంబై తీసుకెళ్లి గదిలో బంధిచాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ మహిళను వాకేశ్వర్లోని తన ఇంట్లో బంధించాడని, బలవంతంగా వివాహం కూడా చేసుకున్నాడని ఇంకో సాక్షి కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసులో నిందితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అప్పట్లో విచారణను ఆపేశారు.
ప్రేమ పెళ్లికి పెద్దలు నో.. ఒప్పించేందుకు ఫ్రెండ్స్తో ఆ కుర్రాడు చెప్పించిన అబద్ధం.. ప్రేయసి ప్రాణం తీసింది.. అసలేం జరిగిందంటే..
ఈ క్రమంలో అనూహ్యంగా 41 ఏళ్ల తర్వాత కేసు విచారణను మళ్లీ మొదలుపెట్టారు. అయితే అప్పట్లో బాధితురాలు అయిన మహిళకు ప్రస్తుతం 55 ఏళ్లు. చాలా ఏళ్ల క్రితమే ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు పెళ్లికి ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఆమె కోర్టుకు లేఖ రాసింది. ప్రస్తుత సమయంలో పాత కేసు విచారణను కొనసాగించడం తనకు ఇష్టం లేదని, తన జీవితం ప్రస్తుతం బాగుందని.. ఈ సమయంలో కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక తనకు లేదని, దయచేసి విచారణ ఆపేయాలని విన్నవించుకుంది. దీంతో ఈ కేసులో వివాహం, అత్యాచారం వంటివి జరగలేదంటూ ఏడాది నవంబర్ 30న కోర్టు తీర్పు ఇచ్చింది.