మా అమ్మను వదిలేయండని పిల్లలు ఏడుస్తున్నా కనికరం లేకుండా.. నడి వీధిలో ఆమెను చెట్టుకు కట్టేసి..

ABN , First Publish Date - 2021-07-29T21:33:04+05:30 IST

అమానవీయ ఘటన ఝార్ఖండ్‌లోని చోట్కి సరియా గ్రామంలో జరిగింది.

మా అమ్మను వదిలేయండని పిల్లలు ఏడుస్తున్నా కనికరం లేకుండా.. నడి వీధిలో ఆమెను చెట్టుకు కట్టేసి..

ఇంట్లో ఆమె తన పిల్లలతో కలిసి నిద్రిస్తోంది.. అంతలో బయట కలవరం బయల్దేరింది.. అత్తింటి తరఫు వారు కర్రలతో పెద్దగా అరుస్తూ లోపలికి ప్రవేశించారు.. ఆమెను బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లారు.. అమ్మను వదిలేయండని పిల్లలు ఏడుస్తున్నా కనికరం లేకుండా ఆమెను చెట్టుకు కట్టేశారు.. ఆమె బట్టలు చింపేశారు.. ఆమెను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.. అయితే సరైన సమయానికి పోలీసులు రావడంతో ఆమె బతికిపోయింది.. ఈ అమానవీయ ఘటన ఝార్ఖండ్‌లోని చోట్కి సరియా గ్రామంలో జరిగింది. 


సరియా గ్రామానికి చెందిన మహిళ భర్త చనిపోవడంతో వితంతువుగా మారింది. పిల్లలతో కలిసి అత్తింట్లోనే జీవనం సాగిస్తోంది. అయితే ఆమె అక్కడ ఉండడం అత్తింటి వారికి ఇష్టం లేదు. ఎన్నోసార్లు వెళ్లిపొమ్మన్నా వేరే దారి లేకపోవడంతో ఆమె అక్కడే ఉండిపోయింది. దీంతో ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని అత్తింటి తరఫువారందరూ ఆమెను మంగళవారం చుట్టుముట్టారు. ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేశారు.


ఆమె బట్టలు చించేసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె బతికిపోయింది. పోలీసులు వచ్చేసరికి వారందరూ పరారయ్యారు. బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి గురించి అన్వేషణ సాగిస్తున్నారు. 

Updated Date - 2021-07-29T21:33:04+05:30 IST