నిషేధంపై టిక్‌టాక్ యాజమాన్యం స్పందన ఇదీ..

ABN , First Publish Date - 2020-06-30T18:15:57+05:30 IST

తమ యాప్ సహా చైనాకి చెందిన 59 యాప్‌లపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను..

నిషేధంపై టిక్‌టాక్ యాజమాన్యం స్పందన ఇదీ..

న్యూఢిల్లీ: తమ యాప్ సహా చైనాకి చెందిన 59 యాప్‌లపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు శిరసావహిస్తున్నామని టిక్‌టాక్ యాజమాన్యం పేర్కొంది. అయితే తాము చైనా ప్రభుత్వంతో ఒక్క వినియోగదారుడి సమాచారాన్ని కూడా షేర్ చేసుకోలేదని స్పష్టం చేసింది. అధికారులను కలుసుకుని, అభిప్రాయాలు తెలపాలంటూ ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయనీ.. అన్ని అంశాలపైనా పూర్తి వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. 


తమ యాప్‌పై నిషేధం విధించిన కొద్ది గంటలకు టిక్‌టాక్ ఇండియా చీఫ్ నిఖిల్ గాంధీ స్పందిస్తూ.... ‘‘భారత చట్టం ప్రకారం సమాచార గోప్యత, భద్రత అంశాలన్నిటిపై టిక్‌టాక్ ఎల్లప్పుడూ తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. భారత్‌లోని తమ వినియోగదారులకు సంబంధించిన ఏ సమాచారాన్నీ ఇప్పటి వరకు ఏ విదేశీ ప్రభుత్వంతోనూ షేర్ చేసుకోలేదు. అఖరికి చైనా ప్రభుత్వంతో కూడా డేటా షేర్ చేసుకోలేదు..’’ అని స్పష్టం చేశారు. కాగా దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి ముప్పు ఉందంటూ టిక్‌టాక్, హలో, వియ్‌చాట్ సహా చైనాకి చెందిన 59 యాప్‌లపై నిన్న భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టిక్‌టాక్, హలో యాప్‌లను గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి తొలగించారు. 

Updated Date - 2020-06-30T18:15:57+05:30 IST