ఆక్సిజన్ సంక్షోభం అంచున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి
ABN , First Publish Date - 2021-05-15T15:00:17+05:30 IST
నగరంలోని స్విమ్స్ ఆస్పత్రి ఆక్సిజన్ సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది.
తిరుపతి: నగరంలోని స్విమ్స్ ఆస్పత్రి ఆక్సిజన్ సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. గత 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్కి ఆక్సిజన్ సరఫరా అవుతోంది. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. అయితే ప్రస్తుతం 8కేఎల్కి మించి ఆక్సిజన్ పంపించలేమని స్విమ్స్కు గుత్తేదార్ తేల్చిచెప్పేశారు. స్విమ్స్లో ప్రస్తుతం 467 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. 90 శాతానికి పడకలకు ఆక్సిజన్ అవసరం ఉంటోంది. రుయా ఘటన దృష్ట్యా స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ ఇక్కడి పరిస్థితిని చిత్తూరు జిల్లా కలెక్టర్, స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని స్విమ్స్ డైరెక్టర్ సూచించారు.