1.13 లక్షల కుటుంబాలు..రూ.113 కోట్ల సాయం
ABN , First Publish Date - 2020-10-25T07:19:10+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంత మునిసిపాలిటీల్లో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయం పంపిణీ ముమ్మరం చేశారు
వరద బాధితులకు ప్రభుత్వం మంజూరు
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజోతి): గ్రేటర్ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంత మునిసిపాలిటీల్లో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయం పంపిణీ ముమ్మరం చేశారు. హైదరాబాద్, పరిసర ప్రాంత మునిసిపాలిటీల్లో 1.13 లక్షల కుటుంబాలు వరద బాధితులుగా అంచనా వేసింది. ఇందుకోసం రూ.113 కోట్లను కేటాయించారు. ఈ పంపిణీని 780 బృందాల ఆధ్వర్యంలో చేపట్టారు.
శనివారం సాయంత్రానికే 70 వేల కుటుంబాలకు పంపిణీ జరిగింది. ఆదివారం నాటికి సంపూర్ణంగా అందజేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మొబైల్ యాప్లను ఉపయోగించి ఈ బృందాలు ఇంటింటికి వెళ్లి బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందజేస్తున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ కల్టెర్ శ్వేతామహంతి తదితరులు ఆర్థిక సహాయం అందించడంలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా దసరా నేపథ్యంలో పంపిణీని మరింత ముమ్మరం చేశారు. కాగా, బాధిత కుటుంబాలకు సత్వరమే ఆర్థిక సహాయం అందించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందికి సోమేశ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు.