నేడే అనంత పద్మనాభుని దీపోత్సవం

ABN , First Publish Date - 2021-12-03T06:07:08+05:30 IST

పద్మనాభంలోని అనంత పద్మనాభుని గిరిపై శుక్రవారం నిర్వహించే దీపోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడే అనంత పద్మనాభుని దీపోత్సవం
అనంతుని గిరి మెట్ల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు

ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో కిశోర్‌

భక్తులకు ఇబ్బందులు కలగకూండా పటిష్ట పోలీస్‌ బందోబస్తు

ట్రాఫిక్‌ మళ్లింపు.. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలాలు

పద్మనాభం, డిసెంబరు 2: పద్మనాభంలోని అనంత పద్మనాభుని గిరిపై శుక్రవారం నిర్వహించే  దీపోత్సవానికి  అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  సాయంత్రం ఐదున్నరకు గిరిపై జేగంట మోగగానే భక్తులు అన్ని దీపాలను ఒక్కసారిగా వెలిగిస్తారు. కాగా దీపోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఆర్డీవో కె.పెంచల కిశోర్‌ పరిశీలించారు. కుంతీమాధవస్వామి ఆలయంతో పాటు అనంతుని గిరి మెట్ల మార్గాన్ని ఆయన తిలకించారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని దేవస్థానం అధికారులకు ఆదేశించారు. అవసమైతే భక్తుల రద్దీని నియంత్రించడానికి బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 


750 మంది పోలీసులతో బందోబస్తు

అనంతుని దీపోత్సవానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రానున్నందున శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సుమారు 750 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా సింహాచలం, అనకాపల్లి నుంచి వచ్చే భారీ వాహనాలను నీలకుండీల జంక్షన్‌ నుంచి ఆనందపురం వైపు, విజయనగరం నుంచి వచ్చే వాహనాలను రెడ్డిపల్లి నుంచి కోరాడ మీదుగా ఎన్‌హెచ్‌-43కి, అలమండ నుంచి వచ్చే వాహనాలను అనంతవరం జంక్షన్‌ నుంచి నీలకుండీల జంక్షన్‌ వైపు మళ్లించనున్నారు. విజయనగరం నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలను పద్మనాభం జంక్షన్‌లోని గాడు అప్పలనాయుడు స్థలంతో పాటు జడ్పీ అతిథిగృహం, ఎంఆర్‌ కళాశాలలో పార్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. మహారాజుపేట కూడలి నుంచి పద్మనాభం వచ్చే భారీ వాహనాలను అనుమతించరు. ఈ రోడ్డులో వచ్చే ద్విచక్ర వాహనాలు, కార్లను మండల కాంప్లెక్స్‌, కస్తూర్బాగాంధీ విద్యాలయం, సివిల్‌ సప్లైస్‌ గొడౌన్‌, స్ర్పింగ్‌ ఫీల్డ్‌ పాఠశాలలోని ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ చేసుకోవాలని ట్రాఫిక్‌ ఏడీసీపీ జి.ఆదినారాయణ తెలిపారు.




Updated Date - 2021-12-03T06:07:08+05:30 IST