నేడు జీవీఎంసీ రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక
ABN , First Publish Date - 2021-07-30T05:29:32+05:30 IST
జీవీఎంసీ పాలక మండలి సాధారణ సమావేశం శుక్రవారం జరగనున్నది.
పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం
కట్టమూరి సతీష్ ఎన్నిక లాంఛనమే
విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పాలక మండలి సాధారణ సమావేశం శుక్రవారం జరగనున్నది. సమావేశంలో రెండో డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవడమే ప్రధాన అజెండాగా కమిషనర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. ఈ ఎన్నికలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించడంతో వైసీపీ నుంచి అభ్యర్థిగా ప్రకటించిన కట్టమూరి సతీష్ ఎన్నిక లాంఛనం కానున్నది. ఈ సమావేశానికి సంబంధించిన అజెండా ఏమిటనే దానిపై అధికారులు గోప్యతపాటిస్తున్నారు. అజెండా వున్నప్పటికీ గోప్యంగా ఉంచుతున్నారా? లేదా డిప్యూటీ మేయర్ ఎన్నికతోనే సమావేశాన్ని ముగిస్తారా? అనే దానిపై అధికారులకు కూడా స్పష్టత లేకపోవడం విశేషం. ఇదిలావుండగా కౌన్సిల్ హాల్లోకి మీడియాకు అనుమతి లేదని, పాత కౌన్సిల్హాల్లోకి పరిమితసంఖ్యలోనే పాత్రికేయులను అనుమతించి సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.