బీభత్సం..భయానకం

ABN , First Publish Date - 2021-05-18T07:16:30+05:30 IST

ప్రచండ గాలులు, అతి భారీ వర్షాలతో పశ్చిమ తీరం గజగజ వణికిపోయింది. పెను తుఫాన్‌గా మారిన ‘తౌక్తే’ బీభత్సం సృష్టించింది. కర్ణాటక నుంచి గుజరాత్‌ వరకు పశ్చిమ తీరంలో

బీభత్సం..భయానకం

పశ్చిమ తీర రాష్ట్రాల్లో ‘తౌక్తే’ తీవ్ర విధ్వంసం 

అతి భారీ వర్షాలు, ప్రచండ గాలులతో కల్లోలం 

మహారాష్ట్రలో ఆరుగురు.. కర్ణాటకలో ఇద్దరి మృతి

అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన 2 బార్జ్‌లు

వాటిలో 410 మంది సిబ్బంది.. రంగంలోకి నేవీ 

కర్ణాటకలో 9 మందిని రక్షించిన నౌకా దళం 

గుజరాత్‌లో 1.50 లక్షల మంది తరలింపు

మూడు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌ 


అమరావతి/విశాఖపట్నం/బెంగళూరు/ముంబై, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రచండ గాలులు, అతి భారీ వర్షాలతో పశ్చిమ తీరం గజగజ వణికిపోయింది. పెను తుఫాన్‌గా మారిన ‘తౌక్తే’ బీభత్సం సృష్టించింది. కర్ణాటక నుంచి గుజరాత్‌ వరకు పశ్చిమ తీరంలో కుండపోతగా వర్షాలు కురిశాయి. పెనుగాలుల బీభత్సం కొనసాగింది. గంటకు 155-165 కి.మీ వేగంతో గాలులు వీచాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అలల ఉధృతి పెరిగింది. ఇప్పటికే కర్ణాటక, కేరళలో భారీ నష్టం వాటిల్లింది. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కర్ణాటకలో ఆదివారం ఆరుగురు మరణించగా, సోమవారం మరో ఇద్దరు చనిపోయారు. గుజరాత్‌, గోవా, మహారాష్ట్రలలో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. మహారాష్ట్రలో ఆరుగురు మరణించారు. సముద్రంలో రెండు బార్జ్‌లు కొట్టుకుపోయాయి. వీటిలో 410 మంది సిబ్బంది ఉన్నారు. భారీ వర్షాలు, గాలులకు ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. 55 విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రైవేటు సంస్థలు పూర్తిగా విమానాలను బంద్‌ చేశాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ సర్వీసులు నిలిచిపోయాయి. గుజరాత్‌లో 1.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అరేబియా సముద్రంలో కొనసాగిన అతి తీవ్ర తుఫాన్‌ మరింత బలపడి పెను తుఫాన్‌గా మారింది. వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రం గుజరాత్‌ తీరం చేరుకుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత పోర్‌బందర్‌, మహువా మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 210 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. తుఫాన్‌ బలపడడానికి వాతావరణంలో మార్పులే కారణంగా నిపుణులు విశ్లేషించారు. కేటగిరీ-3గా దీన్ని పరిగణించాలని చెప్పారు. 


మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు

మహారాష్ట్రలో చాలా ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు  కురుస్తున్నాయి. కొంకణ్‌ ప్రాంతంలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు  మరణించారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో ముగ్గురు, సింధుదుర్గ్‌ జిల్లాలో మరొకరు, నవీ ముంబైలో చెట్టు విరిగిపడి మరో ఇద్దరు మృతిచెందారు. సముద్రంలో 2 చిన్న పడవలు మునగడంతో ముగ్గురు గల్లంతయ్యారు. సహాయక చర్యలపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. మంత్రులు, అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, బలమైన గాలులతో ముంబై మహానగరం వణికిపోతోంది. గంటకు 114 కి.మీ. వేగంలో గాలులు వీచినట్టు అధికారులు తెలిపారు. 


గుజరాత్‌పై తీవ్ర ప్రభావం 

గుజరాత్‌లోని 17 జిల్లాల్లో 655 గ్రామాల ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలించారు. నష్టం జరగవచ్చని భావిస్తున్న ప్రాంతాలలో విద్యుత్‌, రెవెన్యూ, ఆరోగ్య, అటవీ, రోడ్లు, భవనాలు శాఖల సిబ్బందిని మోహరించారు. అలాగే అత్యవసర సహాయక చర్యల కోసం 41 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. అవసరమైతే కొవిడ్‌ బాధితులను తరలించేందుకు పెద్దఎత్తున అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.


23న అండమాన్‌లో అల్పపీడనం?

ఉత్తర అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. తరువాత ఇది బలపడి తుఫాన్‌గా మారొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 26 తరువాత తుఫాన్‌ ఉత్తర ఒడిసా-పశ్చిమ బెంగాల్‌లో తీరం దాటవచ్చని తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు గడువు కంటే ముందుగా కేరళలో ప్రవేశించి అవకాశాలున్నాయని వివరించారు. 


9 మందిని రక్షించిన నౌకాదళం 

కర్ణాటకలో మంగళూరు ఓడరేవుకు 5 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో తుఫాను అలలకు చిక్కుకుపోయిన 9 మంది ఉద్యోగులను నౌకా దళం, కోస్టుగార్డులు రక్షించారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్టు కోస్టుగార్డు డీఐజీ ఎస్‌డీ వెంకటేశ్‌ తెలిపారు. ముడిచమురు అండర్‌ గ్రౌండ్‌ పైప్‌ కనెక్ట్‌ చేసేందుకై కాంట్రాక్ట్‌ పొందిన కేఈఐ-ఆర్‌ఎ్‌సఓఆర్‌ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదంలో చిక్కుకుంది.నేవీ, కోస్టుగార్డు బృందాలు నలుగురిని హెలికాప్టర్‌ ద్వారా, నౌక ద్వారా మరో ఐదుగురిని ఒడ్డుకు తీసుకొచ్చారు. 


సముద్రంలో చిక్కుకున్న 410 మంది

అల్లకల్లోలంగా మారిన అరేబియా సముద్రంలో రెండు నౌకలు కొట్టుకుపోయాయి. ‘బాంబే హై’ ప్రాంతంలో హీరా ఆయిల్‌ ఫీల్డ్స్‌లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ నౌక బార్జ్‌ ‘పీ305’ కొట్టుకుపోయినట్టు నేవీ ప్రతినిధి కమాండర్‌ వివేక్‌ మద్వాల్‌ ధ్రువీకరించారు. ఇందులో 273 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. సహాయక చర్యల కోసం ముంబై నుంచి ఐఎన్‌ఎస్‌ కోచి నౌక బయల్దేరినట్టు వెల్లడించారు. ‘జీఏఎల్‌ కన్‌స్ట్రక్టర్‌’కు చెందిన మరో బార్జ్‌ కొట్టుకుపోయినట్టు నేవీ అధికారులకు సమాచారం వచ్చింది. ఇందులో 137 మంది సిబ్బంది ఉన్నారు.


ప్రధాని మోదీ సమీక్ష

తుఫాన్‌ ప్రభావిత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే, విజయ్‌ రూపానీ, ప్రమోద్‌ సావంత్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ, డామన్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మోదీ ఫోన్‌ చేసి మాట్లాడారు. సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్ల గురించి అడిగి  తెలుసుకున్నారు. కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని, అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం కూడా ప్రధాని మోదీ తుఫాన్‌ పరిస్థితులపై కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


తెలంగాణపై ప్రభావం లేదు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి):  తెలంగాణ రాష్ట్రంపై ‘తౌక్టే’ తుపాను ప్రభావం ఏమాత్రం లేదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రానికి బలమైన కిందిస్థాయి దక్షిణ గాలుల వలన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా సోమవారం కిందిస్థాయి గాలులు తెలంగాణలో దక్షిణదిశ నుండి బలంగా  వీచినట్లు చెప్పారు. రాగల  రెండురోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో  కూడిన తేలికపాటి వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-18T07:16:30+05:30 IST