జిల్లా పోలీసు శాఖకు ప్రతిష్టాత్మక స్కొచ్‌ సిల్వర్‌ అవార్డు

ABN , First Publish Date - 2020-10-29T08:33:25+05:30 IST

కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఎనలేని చొరవ చూపింది.

జిల్లా పోలీసు శాఖకు ప్రతిష్టాత్మక స్కొచ్‌ సిల్వర్‌ అవార్డు

చిత్తూరు, అక్టోబరు 28: కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఎనలేని చొరవ చూపింది. లాక్‌డౌన్‌, అన్‌లాక్‌ సమయంలో అందించిన ఎనలేని సేవలకు ప్రతిష్టాత్మక స్కొచ్‌ సిల్వర్‌ అవార్డు పొందింది. వివరాలివీ.. ‘రెస్పాన్స్‌ టూ కొవిడ్‌-19’ ప్రాజెక్టు పేరుతో లాక్‌డౌన్‌ అమలుతో ఇబ్బంది పడుతున్న రెండులక్షల మంది వలసదారులు, పేదలు, అనాథలకు జిల్లా పోలీసు శాఖ భోజన సదుపాయం కల్పించి ఆదుకుంది. జిల్లాలో ప్రవేశించే ప్రతి ఒక్కరికీ స్ర్కీనింగ్‌ చేయడమే లక్ష్యంగా పోలీసు అధికారులు 102 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సీసీటీవీ ద్వారా నిఘా వేశారు. అంతఃరాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో రెవెన్యూ, వైద్య సిబ్బందినీ అందుబాటులో ఉంచారు.


కరోనా నుంచి కోలుకున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్లాస్మా బ్యాంక్‌ ఏర్పాటు చేసి, ఐదుగురి కరోనా బాధితుల ప్రాణాలు కాపాడారు. కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు నాలుగు పోలీసు డివిజన్లలో ప్రత్యేక అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. ఈ సేవలను స్కొచ్‌ గ్రూపు చైర్మన్‌ సమీర్‌కొచ్చర్‌ గుర్తించి జిల్లా పోలీసు శాఖకు సిల్వర్‌ అవార్డును ప్రకటించారు. దీంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలకు జిల్లా పోలీసులు చేసిన సేవలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. కాగా, స్కొచ్‌ అవార్డు దక్కడంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ బుధవారం ఎస్పీ సెంథిల్‌కుమార్‌, జిల్లా పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. 

Updated Date - 2020-10-29T08:33:25+05:30 IST