సంప్రదాయబద్ధంగా మూడో విడత చందనం అరగదీత ప్రారంభం
ABN , First Publish Date - 2021-06-18T05:37:05+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామికి మూడో విడతగా సమర్పించేందుకు చందనం అరగదీతను గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.
చందనం అరగదీతలో పాల్గొన్న దేవస్థానం పాలక మండలి సభ్యులు
సింహాచలం, జూన్ 17: వరాహలక్ష్మీనృసింహస్వామికి మూడో విడతగా సమర్పించేందుకు చందనం అరగదీతను గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత ఆరాధనలు జరిపాక బాంఢాగారం నుంచి గంధపు చెక్కలను ఆలయ అధికారులు బయటకు తీసి స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఆలయ నాలుగో తరగతి ఉద్యోగులు ఆచారం ప్రకారం చందనాన్ని అరగదీశారు. తొలిరోజు అరగదీతలో దేవస్థానం ట్రస్టీలు వారణాసి దినేశ్రాజ్, సూరిశెట్టి సూరిబాబు, సిరిపురపు ఆశాకృష్ణ, ప్రత్యేక ఆహ్వానితుడు గంట్ల శ్రీనుబాబు, ఈఈ శ్రీనివాసరాజులు పాల్గొన్నారు. తొలిరోజు 28 కిలోల చందనాన్ని అరగదీయగా అధికారులు బాంఢాగారంలో భద్రపరిచారు. ఏఈవో కేకే రాఘవకుమార్, స్థానాచార్యుడు డాక్టర్ టీపీ రాజగోపాల్, పురోహితుడు కరి సీతారామాచార్యులు, హవల్దార్ రాజగోపాల్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.