పట్టాలపై పడ్డ బండరాళ్లు.. ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2020-11-19T18:10:20+05:30 IST
రైలు పట్టాలపై పడిన బండరాళ్లను గురించిన
చెన్నై : రైలు పట్టాలపై పడిన బండరాళ్లను గుర్తించిన డ్రైవర్ హఠాత్తుగా రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మదురై నుంచి దిండుగల్ మీదుగా చెన్నై వెళ్లే వైగై ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఉదయం 8 గంటలకు దిండుగల్ నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు మదురై నుంచి దిండుగల్ వచ్చే మార్గంలో కోడై రోడ్డు సమీపం మురుగన్పట్టి ప్రాంతంలో 3 కి.మీ మేర గుహ వంటి మార్గంలో వెళ్తుంది. ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం కోడై రోడ్డు ప్రాంతం మురుగన్పట్టి పట్టాలపై బండరాళ్లు పడి ఉండడాన్ని గుర్తించిన డ్రైవర్ రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించాడు. దిండుగల్ నుంచి రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకొని బండరాతిని పగులగొట్టి ట్రాక్ మీద నుంచి తొలగించారు. సకాలంలో బండరాళ్లను డ్రైవర్ గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. రాళ్లు తొలగించిన అనంతరం గంట ఆలస్యంగా వైగై ఎక్స్ప్రెస్ బయల్దేరింది. వర్షాలు కురుస్తుండడంతో సమీపంలోని కొండపై నుంచి బండరాళ్లు జారిపడినట్లు రైల్వే ఉద్యోగులు తెలిపారు.