TRS నుంచి బరిలోకి దిగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్సీల ఆస్తులు భారీగా పెరిగాయ్..!
ABN , First Publish Date - 2021-11-23T13:30:44+05:30 IST
స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగుతున్న
- ఆరేళ్లలో మూడురెట్లు పెరిగిన శంభీపూర్ రాజు ఆస్తులు
- రెండేళ్లలో రెట్టింపైన మహేందర్రెడ్డి ఆస్తులు
హైదరాబాద్ సిటీ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుల కుటుంబ ఆస్తులు గతంలో కంటే భారీగా పెరిగాయి. పట్నం మహేందర్రెడ్డి, సుంకరి (శంభీపూర్) రాజు సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వారు ఆఫిడవిట్లలో పొందుపరిచిన ఆస్తుల వివరాలు పరిశీలిస్తే శంభీపూర్ రాజు కుటుంబ ఆస్తులు ఆరేళ్లలో దాదాపు మూడు రెట్లు పెరగగా, మహేందర్రెడ్డి కుటుంబ ఆస్తులు రెండేళ్లలోనే రెట్టింపయ్యాయి.
వీరిద్దరి అప్పులు కూడా పెరిగాయి. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శంభీపూర్ రాజు కుటుంబ మొత్తం ఆస్తుల విలువ రూ. 86,38,000 కాగా తాజాగా ఆయన ఆస్తులు రూ.3,05,45,220లకు పెరిగాయి. ఆయనకు గతంలో రూ,8,50,000 అప్పులు ఉండగా, తాజాగా 1,09,05,482లకు పెరిగాయి. మహేందర్రెడ్డి కుటుంబ ఆస్తులు2019లో రూ. 8,84,31,560 ఉండగా తాజాగా రూ.15,27,64,482 ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి 2019లో రూ. 1,03,75,398 అప్పులుండగా ఇపుడు రూ.1,25,46,047లకు పెరిగాయి.