‘నాక్’ సాధనకు కృషి చేయండి: ‘నన్నయ’ వీసీ
ABN , First Publish Date - 2021-06-12T05:12:21+05:30 IST
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ‘నాక్’ గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఉప కులపతి మొక్కా జగన్నాథరావు పేర్కొన్నారు.
దివాన్చెరువు, జూన్ 11: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ‘నాక్’ గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఉప కులపతి మొక్కా జగన్నాథరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విశ్వవిద్యాలయం నాక్ కమిటీ సభ్యులతో ఆన్లైన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాక్’ గుర్తింపు రావడం ద్వారా అనేక నిధులు సమకూర్చుకుని విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొవిడ్ సమయంలో సమయంలో కుడా పనులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. కమిటీ సభ్యులు నాక్ మార్గదర్శకాలను అనుసరించి సంబంధిత సమాచారాలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ఎస్ఎస్ఆర్ ద్వారా 70 శాతం మార్కులు వస్తాయని, నివేదికకు సంబంధించిన సమాచారాన్ని నాక్ కమిటీ సభ్యులు చక్కగా ప్రదర్శింపజేయాలన్నారు. సమష్టి కృషితో నాక్ గుర్తింపు సాధించి విశ్వవిద్యాలయ అభివృద్ధికి పాటుపడాలన్నారు. నాక్ సాధనకు అవసరమైన పలు కీలకాంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎస్ఎస్ ఆర్లోని ఏడు ప్రధానాంశాలపై కమిటీ సభ్యులు ఆన్లైన్లో చర్చించారు. సమావేశంలో నాక్ కో-ఆర్డినేటర్ ఆచార్య కొట్టి శ్రీరమేష్, ఎగ్జిక్యూటివ్ కో-ఆర్డినేటర్ కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.