రోడ్డు ప్రమాదంలో అవ్వామనవడి మృతి

ABN , First Publish Date - 2021-06-20T06:00:49+05:30 IST

పెద్దమండ్యం సమీపంలో గాలివీడు అంతర్‌జిల్లా రోడ్డుపై వ్యాన్‌, ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో సంఘటనా స్థలంలో ఒకరు, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో అవ్వామనవడి మృతి
బ్రాహ్మణచెరువు కట్టపై బోల్తా పడిన వాహనాలు

 పెద్దమండ్యం, జూన్‌ 19: పెద్దమండ్యం సమీపంలో గాలివీడు అంతర్‌జిల్లా రోడ్డుపై  వ్యాన్‌, ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో సంఘటనా స్థలంలో ఒకరు, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఎస్‌ఐ వెంకటశికుమార్‌ కథనం మేరకు... కడప జిల్లా గాలివీడు మండలం అరవీడు  పంచాయతీ సింగంవారిపల్లెకు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి దంపతులు మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో నివాసం ఉంటున్నారు. సీటీఎంలో నివాసం ఉంటున్న తన కుమార్తె కుమారుడు నారాయణరెడ్డితో కలిసి లక్ష్మీదేవి గాలివీడులో బ్యాంకులో రుణం చెల్లించడానికి ద్విచక్రవాహనంలో బయలు దేరింది. పనులు ముగించుకొని మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. పెద్దమండ్యం సమీపంలోని బ్రాహ్మణచెరువు కట్టపై వస్తుండగా పెద్దమండ్యం మండలం కలిచెర్ల నుంచి గాలివీడుకు వెళ్తున్న వ్యాన్‌ వీరిని ఢీకొనింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌ కిందపడిన నారాయణరెడ్డి(23)  అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీదేవి(60)ని 108 అంబులెన్స్‌లో వాల్మీకిపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతదేహాలను  మదనపల్లె జిల్లా ఆస్పపత్రికి తరలించి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.



Updated Date - 2021-06-20T06:00:49+05:30 IST