వారెవరు.. ఎలా మృతి చెందారు

ABN , First Publish Date - 2021-07-30T06:25:36+05:30 IST

ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. అయితే వారెవరూ.. ఎలా మృతి చెందారో ఎవరికీ అంతుబట్టడంలేదు.

వారెవరు.. ఎలా మృతి చెందారు
గుర్తు పట్టలేని విధంగా ఉన్న మృతదేహాలు

తాడేపల్లిలో ఇద్దరి అనుమానాస్పద మృతి

స్థానికుల సమాచారంతో వెలుగులోకి ఘటన

తాడేపల్లి టౌన్‌, జూలై29: ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. అయితే వారెవరూ.. ఎలా మృతి చెందారో ఎవరికీ అంతుబట్టడంలేదు. తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు ఇంటి తలుపులు పగలకొట్టి చూడగా మంచంపై పురుషుడు, ఓ మహిళ మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. అయితే వీరి గురించి ఎవరికీ తెలియక పోవడం విచిత్రం. విస్తుగొలిపే ఈ వ్యవహారం అటు పోలీసులను, ఇటు స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఉండవల్లి కూడలి నుంచి తాడేపల్లి వైపు వెళ్లే ప్రధాన రోడ్డులోని ఓ ఇంట్లో కొన్నేళ్లుగా ఓ జంట ఉంటుంది. వీరు 2004లో ఇల్లును కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఆ ఇంట్లో నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులుకు తెలిపారు. దీంతో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో ఆ ఇంటి వద్దకు రాగా.. ఇంటి బయట గేటుకు కుక్కలను కట్టే గొలుసుతో కట్టివేసి ఉంది. తలుపు లోపల గడియ పెట్టి ఉంది. దీంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా మంచంపై వెల్లకిలా ఓ ఆడ, మగ మృతదేహాలు పడి ఉన్నాయి. ఆ పరిసరాలను చూస్తే వారు వారం క్రితం వారు మృతి చెంది ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండడం వల్ల మొహాలు కూడా గుర్తించడానికి వీలులేకుండా ఉన్నాయి. వారి వివరాల కోసం ఇంట్లో గాలించగా  ఎటువంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. స్థానికులను ప్రశ్నించగా వారు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు.. ఏం చేస్తుంటారు.. అనే విషయాలు తెలియదన్నారు. చుట్టుపక్కల వారి గురించి ఈ ఇద్దరు పట్టించుకోరని, వారి వివరాలు చెప్పరని స్థానికులు తెలిపారు. గతంలో మ్యాపింగ్‌ కోసం వెళ్లగా వారు వివరాలు చెప్పలేదని వార్డు వలంటీరు పోలీసులకు చెప్పారు.  మృతిచెందిన వారు భార్యాభర్తలా.. ఆత్మహత్య చేసుకున్నారా... ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది విచారణలో తేలాల్సి ఉందని సీఐ తెలిపారు. స్థానిక వీఆర్‌వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

 

Updated Date - 2021-07-30T06:25:36+05:30 IST