హైదరాబాద్లోని స్టార్ హోటల్లో ఇద్దరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-16T13:28:10+05:30 IST
ఈ నెల 8 వ తేది ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు...
- గతంలోనే వారికి వేరే వారితో వివాహం
- విడిచి ఉండలేక ఆత్మహత్య
- తమిళంలో సూసైడ్ నోట్
- పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఘటన
హైదరాబాద్/పంజాగుట్ట : బేగంపేటలోని ఓ స్టార్ హోటల్లో ఓ యువతి, ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడటం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుదుచ్చేరికి చెందిన విజయకుమార్(34), శ్యామల దేవి(36) ఇద్దరూ కలిసి ఈ నెల 8 వ తేది ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ప్రతి రోజు గదికే అవసరమున్న వాటిని తెప్పించునే వారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుడ్ ఆర్డర్, రూమ్ సర్వీస్ గురించి వారు ఫోన్ చేయకపోవడంతోపాటు, ఎంతకీ గది తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే వారు పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో హోటల్ సిబ్బంది సహాయంతో పోలీసులు తలుపు బద్దలు కొట్టారు.
లోపలకు వెళ్లిచూడగా అక్కడ ఇద్దరు విగత జీవులై పడిఉన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కనే తమిళంలో రాసిన సూసైట్నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో గతంలోనే వారిద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహాలు జరిగినట్లు తెలిసింది. వివాహం జరిగినా ఇద్దరు విడిగా ఉండలేక పోయారని, వివాహేతర సంబంధమే వీరిద్దరి ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ నోట్ తమిళంలో ఉండడంతో దానిని అనువదించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏమి రాసి ఉందో పూర్తివివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారి వద్ద ఉన్న ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.