పూర్వవిద్యార్థుల అపూర్వ కలయిక
ABN , First Publish Date - 2021-10-18T05:52:41+05:30 IST
మదనపల్లె పట్టణంలోని జీఆర్టీ హైస్కూల్లో 1975-76లో టెన్త్ చదివిన విద్యార్థులు ఆదివారం స్కూల్లో ఒకచోట చేరి సందడి చేశారు. సుమారు 45 ఏళ్లకిందట కలసి చదువుకున్న బాల్యమిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలు, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.
మదనపల్లె క్రైం, అక్టోబరు 17: మదనపల్లె పట్టణంలోని జీఆర్టీ హైస్కూల్లో 1975-76లో టెన్త్ చదివిన విద్యార్థులు ఆదివారం స్కూల్లో ఒకచోట చేరి సందడి చేశారు. సుమారు 45 ఏళ్లకిందట కలసి చదువుకున్న బాల్యమిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలు, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఆనాటి చదువు, గురువుల విద్యాబోధన, తరగతి గదిలో చేసిన అల్లరి, తదితర అనుభూతులను పంచుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే తరగతి గదులన్నీ కలియ తిరిగి బాల్యంలోకి వెళ్లిపోయారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు మాట్లాడుతూ... 1888లో మదనపల్లెలో జీఆర్టీ పాఠశాల ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకున్నారన్నారు. బాల్యదశ ఎంతో గొప్పదన్నారు. ఏస్థాయిలో ఉన్నా చిన్ననాటి మిత్రులను, చదువు చెప్పిన గురువులను మరచిపోకూడదన్నారు. ఆనాటి విద్య, జ్ఞాపకాలు ఒక అనుభూతిలాంటివన్నారు. పాఠశాలలో 45 ఏళ్లకిందట టెన్త్ చదివిన పూర్వవిద్యార్థులందరూ ఒకచోట చేరి కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.